పార్టీ మారుతున్నట్టు ప్రచారం... మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందన
తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలిలో వార్తల్లో నిలిచే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు. ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి మల్లారెడ్డి నేడు అసెంబ్లీ వద్ద క్లారిటీ ఇచ్చారు.
"నా వయసు ప్రస్తుతం 73 ఏళ్లు. ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో నాకు బాగా తెలుసు. మునిగిపోయే పడవలో ఎవరైనా ఎక్కుతారా? కాంగ్రెస్ పార్టీ ఒక మునిగిపోయే నావ లాంటిది. సీఎం రేవంత్ రెడ్డి 11 ఏళ్లు కాదు, 50 ఏళ్లు సీఎంగా ఉంటామన్నా ఆ పార్టీ మునిగిపోయే పడవే" అంటూ ఆ పార్టీలో చేరికను కొట్టిపారేశారు. ఇటీవల తన పెళ్లి రోజు వేడుకలకు ఆహ్వానించేందుకే రేవంత్ రెడ్డిని కలిశానని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు, మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆమె ప్రధాని మోదీ నాయకత్వాన్ని, కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలను ప్రశంసించడంతో పాటు, హైదరాబాద్ పేరును 'భాగ్యనగర్'గా మార్చాలన్న బీజేపీ డిమాండ్ను సమర్థించారు. ఈ క్రమంలో మల్లారెడ్డి కుటుంబం కాంగ్రెస్ వైపు కాకుండా బీజేపీ వైపు చూస్తోందా? అనే కొత్త చర్చ మొదలైంది. గతంలో ఆమె బీజేపీ అగ్రనేత బండి సంజయ్ను కలవడం కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది.