డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన పుట్టా మహేశ్‌కు ఎంపీగా ఉండే అర్హత లేదు: కాకాణి గోవర్దన్ రెడ్డి

డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌కు పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదని వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. పుట్టా మహేశ్‌ను రక్షించడానికి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే రంగంలోకి దిగారని, డ్రగ్స్ మాఫియాను ఆయనే పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. సామాన్యుడికి ఒక రూల్, ప్రజాప్రతినిధికి మరో రూల్ ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్ శివారు మొయినాబాద్‌లోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో జరిగిన వీకెండ్ పార్టీలో డ్రగ్స్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో పుట్టా మహేశ్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఈగిల్ ఫోర్స్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది.

ఈ నేపథ్యంలో కాకాణి మాట్లాడుతూ, "చంద్రబాబు బ్రాండ్ అంటేనే డ్రగ్స్ బ్రాండ్" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనతో వైసీపీ నేతలు టీడీపీని 'డ్రగ్స్ పార్టీ'గా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ డ్రగ్స్ కేసుపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇదే ఫామ్‌హౌస్‌లో కాల్పులు జరిపిన వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం పుట్టా మహేశ్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.


More Telugu News