లేని గ్యాస్ కొరతను సృష్టించి ప్రజలను భయపెడుతున్నారు: రాంచందర్ రావు

గ్యాస్ కొరత, మూసీ ప్రాజెక్టు అంశాలపై ప్రభుత్వ తీరును తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్రంగా ఎండగట్టారు. దేశంలో అసలు గ్యాస్ కొరత అనేదే లేదని స్పష్టం చేసిన ఆయన, కొంతమంది కావాలనే లేని కొరతను సృష్టించి ప్రజలను భయపెడుతున్నారని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితుల వల్ల అనేక దేశాల్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నా, ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం భారత్‌లో ధరలను నియంత్రణలో ఉంచిందని గుర్తుచేశారు. గతంలో రూ. 1,200 వరకు ఉన్న గ్యాస్ ధరను రూ. 900లకు తగ్గించి సామాన్యుడిపై భారం తగ్గించిన ఘనత కేంద్రానిదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


ఇక మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు విషయంలో బీజేపీ వైఖరిని స్పష్టం చేస్తూ, తాము నది శుద్ధికి వ్యతిరేకం కాదని, కానీ ప్రాజెక్టు పేరుతో పేదల ఇళ్లను కూల్చడాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని రాంచందర్ రావు హెచ్చరించారు. మూసీ ప్రాజెక్టు కోసం 50 మీటర్ల బఫర్ జోన్ అవసరమే లేదని, కేవలం ఒక గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం 100 ఎకరాల భూమిని సేకరించాలని చూడటం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. గుజరాత్‌లో సబర్మతి ప్రాజెక్టును ఎవరికీ నష్టం కలగకుండా ఏ విధంగా పూర్తి చేశారో ప్రభుత్వం గమనించాలని సూచించారు.



More Telugu News