హిడ్మాను చిత్రహింసలకు గురి చేసి చంపేశారు: దేవ్జీ
మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ (తిప్పిరి తిరుపతి) లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఆయుధాలను వదిలేసి ఆయన జన జీవన స్రవంతిలో కలిసిపోయారు. ఆయన ఈరోజు ఒక మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిడ్మా లొంగిపోతానని చెప్పినప్పుడు తాము వారించామని, అయితే పోలీసుల ట్రాప్లో పడి ఆయన ప్రాణాలు కోల్పోయారని దేవ్జీ అన్నారు. హిడ్మాది వంద శాతం బూటకపు ఎన్కౌంటర్ అని, ఆయనను చిత్రహింసలకు గురిచేసి చంపేశారని ఆయన ఆరోపించారు. 'ఆపరేషన్ కగార్' సమయంలో బస్వరాజు చేసిన విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోకపోవడం వల్లే ప్రతిఘటన అనివార్యమైందని, ఆ పోరాటంలోనే బస్వరాజును కోల్పోయామని వెల్లడించారు.
మరోవైపు, అగ్రనేత గణపతి గురించి స్పందిస్తూ.. 2023లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో ఆయనను చివరిసారిగా చూశానని, ఆ తర్వాత ఆయనతో సంబంధాలు లేవని దేవ్జీ స్పష్టం చేశారు. సమాజంలో దోపిడీ రూపం మార్చుకుందే తప్ప తొలగిపోలేదని... దోపిడీ ఉన్నంత కాలం ఉద్యమం కొనసాగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. మావోయిస్టు పార్టీపై నిషేధాన్ని ఎత్తివేసి, జైళ్లలో ఉన్న వారిని రాజకీయ ఖైదీలుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయ పదవుల కోసం తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని, చట్టం పరిధిలోనే ఉండి ప్రజా సమస్యలపై పోరాడతానని దేవ్జీ ప్రకటించారు.