కీసరగుట్ట వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్‌ బీఆర్ నాయుడు

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు నేడు కీసరగుట్టలోని శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించి, అక్కడ కొనసాగుతున్న విద్యాబోధనను పరిశీలించారు. చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్షేత్రస్థాయిలో వేద విద్యా సంస్థలను సందర్శిస్తున్న ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, వేద పాఠశాల చరిత్ర, ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు.


పాఠశాల ప్రిన్సిపాల్ గూడ శ్రీనివాస శర్మతో మాట్లాడిన చైర్మన్, ప్రస్తుతం ఇక్కడ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల వివరాలను, వారికి అందుతున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. పురాతన వేద సంపదను కాపాడుకోవడంలో వేద పాఠశాలల పాత్ర కీలకమని పేర్కొంటూ, భవిష్యత్తులో విద్యార్థుల సంఖ్యను మరింత పెంచేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వేద విజ్ఞానాన్ని భావితరాలకు అందించడంలో టీటీడీ ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.


పాఠశాలలోని సౌకర్యాల పట్ల విద్యార్థులు మరియు అధ్యాపకులు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో పాఠశాల సిబ్బందితో పాటు ఇంజనీరింగ్ అధికారులు డీఈ రామకృష్ణ, జేఈ చలమా నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.



More Telugu News