Tirumala Laddu: తిరుమల లడ్డూ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
- లడ్డూ అంశంపై రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని పిటిషన్
- కేసు పెండింగ్ లో ఉన్నందున... తాము జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు
- ఏవైనా అభ్యంతరాలు ఉంటే సీబీఐకి తెలియజేయాలని సూచన
తిరుమల లడ్డూకు వినియోగించిన కల్తీ నెయ్యి వ్యవహారంలో దాఖలైన కీలక పిటిషన్ను సుప్రీంకోర్టు నేడు కొట్టివేసింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఈ అంశంపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని కోరుతూ మానూరు శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ కేసులో దర్యాప్తు ఇంకా పెండింగ్లో ఉన్నందున, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి వ్యాఖ్యలపై ప్రస్తుతానికి తాము జోక్యం చేసుకోలేమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తాము సీబీఐ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని కోర్టు గుర్తుచేసింది. ఏదైనా అభ్యంతరాలు లేదా సమాచారం ఉంటే నేరుగా సీబీఐ అధికారులకే తెలియజేయాలని పిటిషనర్కు సూచించింది. గతంలో రాజకీయ నేతలు చేసిన వ్యాఖ్యలపై సీబీఐ ఎటువంటి విచారణ జరపలేదని పిటిషనర్ పేర్కొనగా... దర్యాప్తు సంస్థ తన పని తాను చేస్తోందని ధర్మాసనం అభిప్రాయపడింది.