ప్రతి ప్రాణమూ విలువైందే.. నిబంధనల అమలులో కఠినంగా ఉండండి: కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

  • రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ‌ కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశం
  • మహిళలపై నేరాల విషయంలో జీరో టాలరెన్స్ విధానం పాటించాలని స్పష్టీక‌ర‌ణ‌
  • బాణసంచా యూనిట్లు, పేలుడు పదార్థాల నిల్వలపై 15 రోజుల్లో తనిఖీలు పూర్తి చేయాలని గడువు
  • గంజాయి, డ్రగ్స్, రౌడీయిజంపై ఉక్కుపాదం మోపాలని చంద్రబాబు దిశానిర్దేశం
  • రోడ్ సేఫ్టీ పరికరాల కోసం రూ.44 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వ ప్రకటన
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు కీలక దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా శాంతిభద్రతల అంశంపై సుదీర్ఘంగా సమీక్షించిన ఆయన, ప్రజల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలు, మహిళలపై నేరాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాల విషయంలో 'జీరో టాలరెన్స్' విధానంతో అత్యంత కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.

రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యం
ప్రతి ప్రాణమూ విలువైందేనని, రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా పటిష్ఠ‌ చర్యలు చేపట్టాలని సీఎం అన్నారు. పోలీసు, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రమాదాలను తగ్గించాలని సూచించారు. డ్రంకెన్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ లాంటి ఉల్లంఘనలపై ఎవరినీ ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. ఇందుకోసం బ్రీత్ అనలైజర్లు, స్పీడ్ గన్ల కొనుగోలుకు తక్షణమే రూ.44 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు. ముఖ్యంగా అనకాపల్లి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ప్రమాదాలకు కారణమవుతున్న 503 'బ్లాక్ స్పాట్ల'ను గుర్తించి, వాటి వద్ద శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు స్వయంగా ఈ ప్రాంతాలను తనిఖీ చేసి ఫలితాలు చూపాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

మహిళల భద్రత, పేలుడు పదార్థాలపై ప్రత్యేక దృష్టి
మహిళలపై జరిగే నేరాల విషయంలో నిందితులకు భయం పుట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అన్నారు. మదనపల్లి తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడటం ఎస్పీల బాధ్యత అని, గృహ హింస కేసుల్లోనూ కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఇటీవల వేట్లపాలెంలో జరిగిన బాణసంచా పేలుళ్ల ఘటనను ప్రస్తావిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బాణసంచా తయారీ యూనిట్లు, పేలుడు పదార్థాల నిల్వలపై తక్షణమే దాడులు చేసి తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. 15 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వారి లైసెన్సులను సమీక్షించాలని గడువు విధించారు.

గంజాయి, డ్రగ్స్‌పై కఠిన వైఖరి
రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని సీఎం గుర్తుచేశారు. గత పాలనలో పేట్రేగిపోయిన గంజాయి, డ్రగ్స్, రౌడీయిజంపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. నెల్లూరులో గుర్తించిన తరహాలో ఇతర జిల్లాల్లోనూ రౌడీ ముఠాలపై నిఘా పెట్టాలన్నారు. గంజాయి, డ్రగ్స్‌ను నిర్మూలించడంతో పాటు, డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా బాధితుల్లో మార్పు తీసుకురావాలని సూచించారు. ఆర్థిక, సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు కూడా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


More Telugu News