ఆలయాల్లో జంతుబలులు: విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

  • ఆలయాల్లో జంతుబలిపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం
  • విచారణకు స్వీకరించిన సుప్రీం.. కేంద్రానికి నోటీసులు
  • ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ పిటిషన్‌లో వాదన
  • నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీం ఆదేశం
దేశవ్యాప్తంగా దేవాలయాల్లో జరిగే జంతుబలిని అరికట్టాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా దీనిపై స్పందన తెలియజేయాలని ఆదేశించింది.

జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. న్యాయవాది శ్రుతి బిస్త్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. మతపరమైన ఆచారాల పేరుతో ఆలయాల్లో జంతువులను బలివ్వడాన్ని అధికారులు నిరోధించడంలో విఫలమవుతున్నారని పిటిషన్‌లో ఆరోపించారు.

జంతుబలి అనేది భారతీయ తాత్విక సంప్రదాయాలు, చట్టాల్లో పొందుపరిచిన కరుణ, అహింస సూత్రాలకు విరుద్ధమని పిటిషనర్ వాదించారు. దుర్గామాత, కాళికామాత వంటి దేవతలను పూజించే క్రమంలో 'బలిదానం' హిందూ ఆచారాల్లో చారిత్రాత్మకంగా ఉందని, అయితే ఆధునిక రాజ్యాంగ విలువలకు, జంతు సంరక్షణ చట్టాలకు ఇది పొంతన లేకుండా ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ప్రతి పౌరుడు జీవుల పట్ల కరుణ కలిగి ఉండాలనే ప్రాథమిక విధిని రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏ(జీ) గుర్తుచేస్తోందని తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని జంతువుల పట్ల క్రూరత్వానికి సంబంధించిన నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో, ఆలయాల్లో జంతుబలిని నిషేధించేలా అధికారులను ఆదేశించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు.


More Telugu News