Satlapalli Jyothi: హైదరాబాద్లో మహిళా ఎక్సైజ్ సీఐ భర్త ఆత్మహత్య
- ఎక్సైజ్ సీఐ జ్యోతి భర్త శ్రీనివాస్ ఆత్మహత్య
- భార్య వేధింపులే కారణమని సూసైడ్ నోట్
- శ్రీనివాస్ సోదరుడి ఫిర్యాదుతో పోలీసు కేసు నమోదు
హైదరాబాద్లోని నేరెడ్మెంట్లో మహిళా ఎక్సైజ్ సీఐ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. భార్య వేధింపులు భరించలేక నగెల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి సూసైడ్ నోట్ రాసి, ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేస్తోంది. వివరాల్లోకి వెళితే... మంచిర్యాల జిల్లాకు చెందిన శ్రీనివాస్ 2012లో సట్లపల్లి జ్యోతిని వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె ఉన్నత చదువులకు, ఉద్యోగ ప్రయత్నాలకు శ్రీనివాస్ పూర్తి స్థాయిలో అండగా నిలిచారు. ఆయన ప్రోత్సాహంతోనే జ్యోతి ఎక్సైజ్ శాఖలో ఎస్సైగా ఎంపికై, ప్రస్తుతం సీఐ స్థాయికి చేరుకున్నారు.
అయితే పదవి, హోదా పెరిగిన తర్వాత వారి కాపురంలో కలహాలు మొదలైనట్టు తెలుస్తోంది. సీఐగా ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇంటికి రావడం కూడా మానేసిందని సమాచారం. గత నాలుగు నెలలుగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. జ్యోతి తన పలుకుబడిని ఉపయోగించి శ్రీనివాస్పై తప్పుడు వరకట్న వేధింపుల కేసులు పెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురైన శ్రీనివాస్ చివరకు తన చావుకు భార్యే కారణమని సైసైడ్ లెటర్ రాసి రాసి బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఈ ఘటనపై మృతుడి సోదరుడు శివకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.