మన నిపుణులకు విదేశాల్లో ఫుల్ డిమాండ్... భారత్ కు మూడో ర్యాంకు!

  • ప్రపంచవ్యాప్త విదేశీ నియామకాల్లో భారత్‌కు మూడో స్థానం
  • ప్రపంచంలోని ఏఐ ట్రైనర్లలో 7.2 శాతం భారతీయులే
  • అమెరికా తర్వాత అతిపెద్ద టాలెంట్ బేస్‌గా నిలిచిన ఇండియా
  • భారత నిపుణుల కోసం యూఎస్, యూకే, ఆస్ట్రేలియా పోటీ
  • భారత్‌లో ఏఐ ట్రైనర్ల సగటు వేతనం గంటకు 12 డాలర్లు
గ్లోబల్ డిజిటల్ వర్క్‌ఫోర్స్‌లో భారత్ తన పాత్రను వేగంగా విస్తరించుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా విదేశీ నియామకాలు జరిపే దేశాల్లో భారత్ మూడో అతిపెద్ద దేశంగా నిలిచింది. అంతేకాకుండా, ప్రపంచంలోని మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ట్రైనర్లలో 7.2 శాతం వాటాతో కీలక శక్తిగా ఎదుగుతోందని ఓ నివేదిక వెల్లడించింది.

డీల్ అనే సంస్థ గురువారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యంత అధిక ప్రతిభా వనరులు  కలిగిన దేశాల్లో అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ విషయంలో ఫిలిప్పీన్స్, కెనడా వంటి దేశాలను భారత్ అధిగమించింది. గ్లోబల్ లేబర్ మార్కెట్‌లో వస్తున్న మార్పులను ఈ నివేదిక హైలైట్ చేసింది. ముఖ్యంగా ఏఐ ట్రైనింగ్ ఒక కొత్త వృత్తిగా ఆవిర్భవించడం, ప్రత్యేక నైపుణ్యాల కోసం స్టార్టప్‌లు అంతర్జాతీయ నియామకాలు చేపట్టడం వంటి అంశాలను ప్రస్తావించింది.

భారతీయ నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే, అమెరికా నుంచి భారత్‌లో నియామకాలు 24 శాతం, యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి 64 శాతం, ఆస్ట్రేలియా నుంచి 61.5 శాతం పెరిగాయి. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, టెస్టింగ్, యూజర్ ఇంటర్‌ఫేస్ వంటి ఉద్యోగాలకు బాగా డిమాండ్ ఉంది.

ఈ నివేదికలో ఏఐ ట్రైనర్ల వృద్ధి మరో ముఖ్యమైన అంశం. ప్రపంచవ్యాప్తంగా 600కు పైగా సంస్థల్లో సుమారు 70,000 మంది ఏఐ సిస్టమ్‌లకు శిక్షణ ఇస్తున్నారని తేలింది. సాధారణంగా గ్లోబల్ మార్కెట్‌లో ఏఐ ట్రైనర్లు గంటకు 15 నుంచి 20 డాలర్లు సంపాదిస్తుండగా, నిపుణులు గంటకు 50 నుంచి 100 డాలర్ల వరకు ఆర్జిస్తున్నారు. అయితే, భారత్‌లో ఏఐ ట్రైనర్ల సగటు వేతనం గంటకు 12 డాలర్లుగా ఉందని నివేదిక పేర్కొంది. ఇది గ్లోబల్ లేబర్ మార్కెట్లలోని వ్యత్యాసాలను సూచిస్తోంది.


More Telugu News