రెండో పెళ్లికి ఒప్పుకోలేదని భార్యపై భర్త కర్కశం.. రోడ్డుపై పడేసి దాడి

  • కాకినాడ జిల్లా సామర్లకోటలో వెలుగుచూసిన ఘటన
  • బాధితురాలు ఎక్సైజ్ కానిస్టేబుల్‌
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య.. కేసు నమోదు
రెండో పెళ్లి చేసుకునేందుకు అంగీకరించలేదన్న కోపంతో ఓ భర్త కట్టుకున్న భార్యపై అమానుషంగా ప్రవర్తించాడు. నడిరోడ్డుపై ఆమెను కిందపడేసి విచక్షణారహితంగా కొట్టాడు. ఈ దారుణ ఘటన కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పీ వేమవరంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. పీ వేమవరానికి చెందిన మణికంఠ, దేవి 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దేవి ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. అయితే, తన మేనకోడలిని రెండో పెళ్లి చేసుకోవాలని మణికంఠ నిర్ణయించుకున్నాడు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి.

ఇదే క్రమంలో తాజాగా మరోసారి వాగ్వాదం జరగడంతో మణికంఠ కోపంతో ఊగిపోయాడు. భార్య దేవిని రోడ్డుపై కిందపడేసి దారుణంగా కొట్టాడు. భర్త వేధింపులు భరించలేకపోయిన ఆమె, తనకు న్యాయం చేయాలంటూ సర్పవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News