Hormuz Strait: భారత్ వస్తున్న నౌకపై హోర్ముజ్ జలసంధి వద్ద దాడి.. ముగ్గురు అదృశ్యం

Hormuz Strait Attack on India Bound Cargo Ship Three Missing
  • థాయ్ జెండా కలిగిన కార్గో నౌకపై వెనుక నుంచి దాడి
  • గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవుకు వస్తుండగా దాడి
  • 20 మంది సిబ్బందిని కాపాడిన ఒమన్ నౌకాదళం
హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న థాయ్ జెండా కలిగిన కార్గో నౌక గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవుకు వస్తుండగా దాడి జరిగింది. ఈ కార్గో నౌక యూఏఈలోని పోర్టు నుంచి బయలుదేరి హోర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు ఈ దాడి జరిగినట్లు రాయల్ థాయ్ నేవీ వెల్లడించింది. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది కనిపించకుండా పోయారు.

మయూరీ నారీ అనే ఆ థాయ్ నౌక ఇరాన్‌కు సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో ఆ నౌక వెనుక భాగం నుండి దాడికి గురైందని రాయల్ థాయ్ నేవీ తెలిపింది. ఈ నౌక యూఏఈలోని ఖలీఫా పోర్ట్ నుంచి కాండ్లా పోర్టుకు బయలుదేరిందని, హోర్ముజ్ వద్ద దాడికి గురి కావడంతో నౌక నుంచి దట్టమైన పొగలు వచ్చాయని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కూడా విడుదల చేసింది.

ఈ దాడికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు రాయల్ థాయ్ నేవీ పేర్కొంది. దాడి జరిగిన సమయంలో నౌకలో 23 మంది సిబ్బంది ఉన్నారని, 20 మంది నావికులను ఒమన్ నౌకాదళం రక్షించినట్లు తెలిపింది. గల్లంతైన ముగ్గురి ఆచూకీని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ దాడి ఇరాన్ చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Hormuz Strait
Cargo ship attack
Mayuree Naree
Gulf of Oman
India bound ship
Thailand ship attack

More Telugu News