పుతిన్‌తో ట్రంప్ సుదీర్ఘ ఫోన్ కాల్.. గంటపాటు చర్చలు

  • అమెరికా, రష్యా అధ్యక్షుల మధ్య గంటపాటు ఫోన్ సంభాషణ
  • ఇరాన్‌లో యుద్ధం, ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధానంగా చర్చలు
  • ఇరాన్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పుతిన్ స్పష్టీకరణ
  • యుద్ధం కొనసాగితే చమురు ధరలపై ప్రభావం తప్పదని హెచ్చరిక
అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్‌లో దాదాపు గంటపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఇరాన్ యుద్ధం, అలాగే ఉక్రెయిన్ సంక్షోభం తీవ్రతపై ఇరువురు నేతలు విస్తృతంగా మాట్లాడుకున్నారు. 

ట్రంప్ చొరవతోనే ఈ ఫోన్ కాల్ సంభాషణ జరిగిందని రష్యా అధ్యక్ష భవనం ప్రతినిధి యూరి వుషకోవ్ మీడియాకు తెలిపారు. ఈ సంభాషణ ఎంతో నిర్మాణాత్మకంగా సాగిందని, ఇది ఇరు దేశాల నేతల మధ్య జరిగే సాధారణ చర్చల వంటిదేనని ఆయన వివరించారు. 

మరోవైపు, ట్రంప్ మాట్లాడుతూ, "నేను పుతిన్‌తో చాలా మంచి సంభాషణ జరిపాను. ఉక్రెయిన్ గురించి చర్చించాం. అదొక ఎప్పటికీ అంతం కాని యుద్ధం. కానీ, ఈ అంశంపై సానుకూల చర్చ జరిగింది. ఉక్రెయిన్, మధ్యప్రాచ్యం గురించి చర్చించాం. ఈ సమస్యల పరిష్కారానికి పుతిన్ సాయం చేయాలని కోరుకుంటున్నారు" అని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా పుతిన్, ఇరాన్ యుద్ధంపై తన అభిప్రాయాలను ట్రంప్‌కు స్పష్టం. ఇరాన్‌కు రష్యా బేషరతు మద్దతు కొనసాగుతుందని ఆయన తేల్చిచెప్పారు. పశ్చిమ ఆసియాలో యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలు దెబ్బతిని, ధరలలో పెను మార్పులు వస్తాయని పుతిన్ హెచ్చరించారు.

ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన ఉమ్మడి దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమెనీ మరణించిన తర్వాత పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. 


More Telugu News