బెంగాల్ గవర్నర్‌గా, క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే 12 సెంచరీలు చేశా: మాజీ గవర్నర్ ఆనందబోస్

  • అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆకస్మికంగా రాజీనామా చేసిన బోస్
  • సమయం వచ్చే వరకు రాజీనామాకు గల కారణాలు గోప్యంగా ఉంటాయన్న బోస్
  • ఓటు వేసేందుకు తిరిగి బెంగాల్ వస్తానన్న ఆనందబోస్
పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా 1200 రోజులు సేవలందించానని, క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే 12 సెంచరీలు చేశానని గవర్నర్ పదవికి రాజీనామా చేసిన ఆనందబోస్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన ఆకస్మికంగా రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. రాజీనామా వ్యవహారంపై ఆయన స్పందిస్తూ, అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. రాజీనామాకు గల కారణాలను సరైన సమయం వచ్చే వరకు గోప్యంగా ఉంటాయని అన్నారు.

కోల్‌కతా విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓటు వేసేందుకు తిరిగి బెంగాల్‌కు వస్తానని తెలిపారు. ప్రవేశం ఉన్నచోట నిష్క్రమణ కూడా ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్య చేశారు. 1200 రోజులు గవర్నర్‌గా సేవలు అందించడం తనకు చాలునని అన్నారు. నిష్క్రమించడానికి ఇది సరైన సమయమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎదురైన చేదుఘటనపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, రాష్ట్రపతి ఎంతో అనుభవజ్ఞురాలని, గౌరవప్రదమైన వ్యక్తి అన్నారు. ఆమె అలా మాట్లాడటానికి కారణాలు ఏమైనా ఉండవచ్చని అన్నారు. రాష్ట్రపతి చేసిన కామెంట్లపై తాను ఎలాంటి వ్యాఖ్య చేయబోనని అన్నారు. కేరళకు చెందిన ఆనందబోస్ తన రాజీనామాకు వారం రోజుల ముందు తన ఓటు హక్కును బెంగాల్‌కు మార్చుకున్నారని తెలుస్తోంది.


More Telugu News