వేసవి కాలం అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం: హైడ్రా కమిషనర్ రంగనాథ్

  • బాచుపల్లి ప్రమాద స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
  • వేసవిలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
  • ఏళ్లుగా కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు ఒక్క ప్రమాదంతో బూడిద అవుతున్నాయన్న రంగనాథ్
  • ఫైర్ సేఫ్టీ నిబంధనలు పట్టించుకోని వారిపై చర్యలు తీసుకునే అధికారం హైడ్రాకు కట్టబెట్టాలని విజ్ఞప్తి
వేసవి కాలం ప్రారంభమైనందున అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. హైదరాబాద్‌లోని బాచుపల్లిలో నిన్న భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రధాన రహదారి వెంబడి పలు దుకాణాలు దగ్ధం కాగా, సుమారు రూ.5 కోట్ల నష్టం జరిగింది. ఈ ప్రమాద స్థలాన్ని రంగనాథ్ పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వేసవికాలంలో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అగ్ని ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అందరూ అవగాహన పెంచుకోవాలని రంగనాథ్ సూచించారు. తనిఖీలు చేసినంత మాత్రాన అగ్నిప్రమాదాలను నియంత్రించలేమని అన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఏంచేయాలనే వాటిని అందరూ పాటించినప్పుడే ఫలితాలు ఉంటాయని అన్నారు. ఏళ్లుగా కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు ఒక్క ప్రమాదంతో బూడిద అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అగ్ని ప్రమాదం సంభవించిన ఒక్కో దుకాణంలో రూ.25 ల‌క్ష‌ల‌కు పైగా ఫ‌ర్నీచ‌ర్ ఉంద‌ని నిర్వాహ‌కులు చెబుతున్నారని, మొత్తం 22 దుకాణాలు కాలి బూడిద అయ్యాయని తెలిపారు. ఇది దుకాణ యజమానులకు తీరని నష్టమని ఆయన అన్నారు. న‌ష్ట‌ప‌రిహారం రెవెన్యూ విభాగం చూసుకుంటుందని తెలిపారు. అయితే ప్ర‌మాదాలు నివారించడానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. తనిఖీలతో పాటు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పట్టించుకోని వారిపై చర్యలు తీసుకునే అధికారం హైడ్రాకు కట్టబెట్టాలని రంగనాథ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Ranganath
Hyderabad fire accident
Bachupally fire
summer fire safety
fire prevention
fire safety regulations

More Telugu News