దుబాయ్‌లో డ్రోన్ కలకలం: అమెరికా కాన్సులేట్ సమీపంలో పేలుడు.. భారీగా ఎగసిపడ్డ మంటలు

  • పార్కింగ్ స్థలంలో డ్రోన్ కూలి మంటలు
  • ఇది తమ ప్రతీకార చర్యేనని పరోక్షంగా ప్రకటించిన ఇరాన్
  • రియాద్, కువైట్‌లలోనూ అమెరికా కార్యాలయాలపై దాడులు
  • దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నామన్న ట్రంప్
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు వాణిజ్య నగరం దుబాయ్‌కి పాకాయి. మంగళవారం రాత్రి అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. కాన్సులేట్ భవనానికి సమీపంలోని పార్కింగ్ స్థలంలో డ్రోన్ కుప్పకూలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

సమాచారం అందుకున్న దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనలో సిబ్బంది ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని అమెరికా అధికారులు ధ్రువీకరించారు. ఈ దాడి కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని దుబాయ్ మీడియా కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.

గత 48 గంటల్లో సౌదీ అరేబియా రాజధాని రియాద్, కువైట్‌లోని అమెరికా రాయబార కార్యాలయాలపై కూడా ఇరాన్ డ్రోన్లతో దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. తమ దేశంపై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు చేపట్టినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా పరోక్షంగా వెల్లడించింది.

ఈ పరిణామాలపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తీవ్రంగా స్పందించింది. తమ భూభాగాన్ని ఇతర దేశాలపై దాడులకు వేదికగా మార్చడాన్ని సహించబోమని స్పష్టం చేసింది. అదే సమయంలో, తమ భద్రతకు ముప్పు వాటిల్లితే ఆత్మరక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు, ఈ దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా పరిగణిస్తున్నారని, ఇరాన్‌ను అణ్వాయుధాలు సాధించకుండా నిరోధించడమే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.


More Telugu News