ఇరాన్ తాజాగా చర్చలకు ప్రయత్నించింది... ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పాను: ట్రంప్

  • ట్రూత్ సోషల్ లో ట్రంప్ పోస్ట్
  • ఇరాన్ వాయుసేన, నావికాదళం, రక్షణ వ్యవస్థలు ధ్వంసమైనట్లు వెల్లడి
  • ఆ దేశ నాయకత్వం కూడా తుడిచిపెట్టుకుపోయిందన్న అమెరికా అధ్యక్షుడు
యుద్ధం మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తాజాగా తమతో చర్చలు జరిపేందుకు సిద్ధమైందని, కానీ అందుకు సమయం మించిపోయిందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా ఈ విషయంపై స్పందించారు. "ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ (వాయు రక్షణ వ్యవస్థ), ఎయిర్ ఫోర్స్ (వాయుసేన), నేవీ (నావికాదళం) తుడిచిపెట్టుకుపోయాయి. ఇరాన్ నాయకత్వాన్ని తుదముట్టించాం. ఇప్పుడు వారు మాతో మాట్లాడాలని కోరుకుంటున్నారు. తాజాగా ఇరాన్ చర్చలు జరిపేందుకు ప్రయత్నించింది. దానికి నేను 'టూ లేట్' (ఇప్పటికే చాలా ఆలస్యమైంది) అని సమాధానమిచ్చాను" అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. 

వాషింగ్టన్ పోస్ట్‌లో 'ట్రంప్ డాక్ట్రిన్' పేరుతో వచ్చిన ఒక విశ్లేషణాత్మక కథనానికి స్పందనగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకోగా, అమెరికా సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. ఇరాన్ సైనిక శక్తి, నాయకత్వం తీవ్రంగా నష్టపోయాయని, యుద్ధం మరికొన్ని వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని ట్రంప్ అంచనా వేశారు. అమెరికా సైనిక శక్తి తిరుగులేనిదని ఆయన పునరుద్ఘాటించారు. 


More Telugu News