హోర్ముజ్ జలసంధిని ఇరాన్ ఎక్కువ రోజులు మూసివేయలేదా... కారణాలివే!
- అమెరికా, ఇజ్రాయెల్తో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం
- ఇరాన్ మిత్ర దేశం చైనాకు హోర్ముజ్ నుంచి అధిక చమురు సరఫరా
- ఈ కారణంగా ఎక్కువ రోజులు జలసంధిని మూయకపోవచ్చుననే వాదనలు
- అమెరికా, ఐరోపా, ఆసియా, పశ్చిమ దేశాలకు సరఫరా చేసేందుకు ఇతర మార్గాలు
ఇరాన్కు చైనా మిత్రపక్షం. ఈ జలసందిని మూసివేస్తే భారత్, చైనాలపై కూడా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఈ మార్గం ద్వారా చైనాకు అధిక చమురు సరఫరా అవుతుంది. మిత్రదేశం చైనాపై ప్రభావం పడనున్న నేపథ్యంలో ఈ జలసంధిని ఎక్కువకాలం మూసివేయకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, హోర్ముజ్కు వివిధ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కానీ ఇవి ఖర్చుతో కూడుకున్నవి కావడం గమనార్హం.
అమెరికా ఇతర దేశాల రక్షణతో ముడిచమురు ట్యాంకర్లు హోర్ముజ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉంది. అలాగే గల్ఫ్లోని వివిధ దేశాల నుంచి పైప్లైన్లు ఉన్నాయి. వీటి ద్వారా పెట్రోలియం సరఫరా చేయడానికి అవకాశం ఉంది. సౌదీ అరేబియాలో తూర్పు నుంచి పశ్చిమం వైపు పెట్రోలైన్ పేరుతో పెద్ద పైపులైన్ ఉంది. ఇది ఎర్రసముద్రంలోని యంబు నౌకాశ్రయం వరకు ఉంటుంది. దీనితో ఐరోపా, అమెరికాలకు చమురు సరఫరా చేయవచ్చు.
యూఏఈ రాజధాని అబుదాబి నుంచి ఒమన్లోని పుజైరా వరకు ఉన్న పైపులైన్ ద్వారా పెట్రోలియంను సరఫరా చేసి అక్కడి నుంచి నౌకాశ్రయాల ద్వారా చమురును ఆసియాలోని ఇతర దేశాలకు ఎగుమతి చేయవచ్చు. ఇరాక్ లోని కిర్కుక్ నగరం నుంచి సీహన్ నగరం వరకు ఉన్న పైపులైన్ ద్వారా టర్కీకి పెట్రోలియం అందుతుంది. టర్కీ నుంచి పశ్చిమ దేశాలకు సరఫరా చేయవచ్చు. అయితే ఈ పైపులైన్కు కొన్నిచోట్ల చిన్న చిన్న మరమ్మతులు చేయాలి.