ఇరాన్‌కు మద్దతుగా చైనా వ్యాఖ్యలు... యుద్ధం నిలిపివేయాలని అమెరికా-ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి

  • ఇరాన్ విదేశాంగ మంత్రితో ఫోన్‌లో మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రి
  • ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు నిలిపివేయాలన్న చైనా
  • ఇరాన్ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి చేస్తున్న పోరాటానికి చైనా మద్దతిస్తుందని వ్యాఖ్య
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంపై చైనా స్పందించింది. పశ్చిమాసియా తీవ్ర ఉద్రిక్తతలో డ్రాగన్ కంట్రీ ఇరాన్‌కు మద్దతుగా నిలిచింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీతో ఫోన్‌లో మాట్లాడారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులను నిలిపివేయాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు.

ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని, భద్రతను, ప్రాదేశిక సమగ్రతను, జాతీయ గౌరవాన్ని కాపాడుకోవడానికి మరియు దాని చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి చేస్తున్న పోరాటానికి చైనా మద్దతు ఇస్తుందని వాంగ్ యి తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ వెంటనే ఇరాన్‌పై సైనిక చర్యలను నిలిపివేయాలని, ప్రస్తుత పరిణామాలు మరింత తీవ్రతరం కాకుండా చూడాలని ఆయన సూచించారు. 

మరోవైపు, ఇరాన్ దాడులను విస్తృతం చేసింది. సౌదీ అరేబియాలోని అమెరికా రాయబార కార్యాలయంపై డ్రోన్లతో దాడి చేసింది. ఇరాక్‌లోనూ పేలుళ్లు సంభవించాయి. బహ్రెయిన్‌లో సైరన్‌లు మోగాయి. ఇంకోవైపు బీరుట్‌లోని హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు తీవ్రం చేసింది.


More Telugu News