అమెరికా యుద్ధనౌక అబ్రహాం లింకన్‌పై దాడి చేశాం: ఇరాన్ సంచలన ప్రకటన

  • సుప్రీం లీడర్ ఖమెనీ మరణానికి ప్రతీకారంగానే దాడి
  • నాలుగు బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించినట్లు ఐఆర్‌జీసీ ప్రకటన
  • దురాగతాలకు పాల్పడేవారికి శ్మశానమే గతి అని హెచ్చరిక
  • ఇరాన్ వాదనలను ఇంకా ధృవీకరించని అమెరికా నావికాదళం
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న అమెరికా యుద్ధ విమాన వాహక నౌక 'యూఎస్ఎస్ అబ్రహం లింకన్'పై భారీ దాడి చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) సంచలన ప్రకటన చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

నాలుగు బాలిస్టిక్ మిస్సైళ్లతో అమెరికా యుద్ధ నౌకను లక్ష్యంగా చేసుకున్నామని, నౌక దెబ్బతిన్నదని ఐఆర్‌జీసీ పేర్కొంది. ఈ మేరకు ఇరాన్ స్థానిక మీడియా ఒక ప్రకటనను వెలువరించింది. "భయంకర దురాగతాలకు పాల్పడేవారికి (టెర్రరిస్ట్ అగ్రెసర్స్) భూమి, సముద్రం శ్మశానంగా మారతాయి" అని ఇరాన్ మిలిటరీ వర్గాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. ఖమేనీ మరణంపై ఇరాన్ ప్రజల్లో, మిలిటరీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

అయితే, ఇరాన్ చేసిన ఈ ప్రకటనను అమెరికా ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. యూఎస్ సెంట్రల్ కమాండ్ లేదా నావికాదళం నుంచి యుద్ధ నౌక దెబ్బతిన్నట్లు ఎటువంటి సమాచారం రాలేదు. అమెరికా బలగాలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని అనధికారిక వర్గాల సమాచారం. కాగా, ఇరాన్ మీడియా మాత్రం దాడి విజయవంతమైందని ప్రచారం చేస్తోంది.

ఇప్పటికే ఈ ప్రాంతంలో అమెరికా తన నావికాదళాన్ని భారీగా మోహరించింది. యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌తో పాటు యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్. ఫోర్డ్ వంటి నౌకలు పర్షియన్ గల్ఫ్, అరేబియన్ సముద్ర జలాల్లో పహారా కాస్తున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరానీయులు అక్కడి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తాజా దాడుల వార్తలతో గల్ఫ్ ప్రాంతంతో పాటు ప్రపంచ మార్కెట్లు, ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




More Telugu News