Abbas Araghchi: మా దేశంలో పాలనను మార్చడం అసాధ్యం: ట్రంప్‌పై ఇరాన్ మంత్రి ఆగ్రహం

Abbas Araghchi Impossible to change governance in our country
  • మాకు ఎవరి సహాయం అవసరం లేదు.. మమ్మల్ని మేం రక్షించుకోగలమని వ్యాఖ్య
  • మా దేశానికి వ్యతిరేకంగా సైనిక చర్యను ప్రారంభించినా పాలనను మార్చలేరన్న మంత్రి
  • ఇరుదేశాలు కలిసి తమపై చేస్తున్న యుద్ధం చట్టవిరుద్ధమన్న అబ్బాస్ అరాఘ్చీ
తమ దేశంలో పాలనను మార్చడం అసాధ్యమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ అన్నారు. తమకు ఎవరి సాయం అవసరం లేదని, మమ్మల్ని మేం రక్షించుకోగలమని పేర్కొన్నారు. తమ దేశానికి వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యలను ప్రారంభించి ఉండవచ్చని, కానీ పాలనను మాత్రం మార్చలేదని అన్నారు. ఉద్రిక్తలను తగ్గించుకోవడం అవసరమని అభిప్రాయపడ్డారు.

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలిసి తమపై చేస్తున్న యుద్ధం చట్టవిరుద్ధమని విదేశాంగ మంత్రి మండిపడ్డారు. అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ఫస్ట్‌గా మార్చారని విమర్శించారు. దురాక్రమణదారులకు తమ సాయుధ బలగాలు సరైన గుణపాఠం చెబుతాయని అన్నారు.

ఇదిలా ఉండగా, అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడి నేపథ్యంలో టెహ్రాన్‌ను ఖాళీ చేయాలని ఇరాన్ తమ ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, అమెరికా దాడి నేపథ్యంలో దుబాయ్, అబుదాబీ సహా వివిధ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. 14 అమెరికా స్థావరాలపై చేసిన దాడిలో వందలాది మంది అమెరికా సైనికులు హతమైనట్లు ఇరాన్ ప్రకటించింది.

కాగా, ఇరాన్‌పై దాడుల నేపథ్యంలో హర్మోజ్‌గాన్ ప్రావిన్సు మినాబ్ నగరంలో ఒక బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో 40 మందికి పైగా మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ దాడిలో మరో 45 మంది గాయపడ్డారు. దాడి సమయంలో పాఠశాలలో 170 మంది విద్యార్థులు ఉండగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇరాన్ పారామిలిటరీ ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ కోర్‌కు ఇక్కడ స్థావరం ఉంది.
Abbas Araghchi
Iran
Donald Trump
Israel
US military action
Iran US tensions
Netanyahu
Middle East conflict

More Telugu News