Pakistan Afghanistan Conflict: పాక్-ఆఫ్ఘన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు.. 55 మంది పాక్ సైనికుల మృతి!

Pakistan Afghanistan Conflict War Erupts 55 Soldiers Dead
  • పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య భగ్గుమన్న సరిహద్దు వివాదం
  • ఆఫ్ఘన్‌పై పాక్ వైమానిక దాడులు.. 'ఆపరేషన్ గజాబ్-లిల్-హక్' ప్రారంభం
  • 70 మంది ఉగ్రవాదులను హతమార్చామని ప్రకటించిన పాకిస్థాన్
  • ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి
దశాబ్దాలుగా ఉన్న పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు వివాదం తీవ్రరూపం దాల్చి యుద్ధానికి దారితీసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. తాలిబన్లు జరిపిన దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ వైమానిక దళం ఆఫ్ఘన్ నగరాలపై బాంబుల వర్షం కురిపించడంతో యుద్ధ వాతావరణం నెలకొంది.

తమ భూభాగంపై తాలిబన్లు జరిపిన కాల్పులకు బదులుగా పాకిస్థాన్ 'ఆపరేషన్ గజాబ్-లిల్-హక్'ను ప్రారంభించింది. పాక్ యుద్ధ విమానాలు కాబూల్, కాందహార్, పక్తియా నగరాల్లోని తాలిబన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపాయి. ఈ దాడుల్లో 70 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని, భారీగా ఆయుధ సంపత్తి ధ్వంసమైందని పాక్ రక్షణ శాఖ వెల్లడించింది.

మరోవైపు, తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ సంచలన ప్రకటన చేశారు. తమ ఎదురుదాడిలో 55 మంది పాకిస్థాన్ సైనికులను హతమయ్యారని, సరిహద్దులోని 19 పాక్ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. కొంతమంది పాక్ సైనికులను బందీలుగా పట్టుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. అయితే, తాలిబన్ల వాదనను పాకిస్థాన్ ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.

తాజా సమాచారం ప్రకారం సరిహద్దులోని టోర్ఖమ్ గేట్ వద్ద ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. "మా సహనం నశించింది, ఇక యుద్ధమే" అని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్రంగా స్పందించారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి చేస్తుండగా, సరిహద్దు గ్రామాల్లోని వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.
Pakistan Afghanistan Conflict
Afghanistan
Pakistan
Taliban
Kabul
Kandahar
Operation Gajab Lil Haq
Torkham Gate
Khawaja Asif
Pakistan Army

More Telugu News