భార్యకు విడాకులిచ్చిన భారత యువ క్రికెటర్!

  • భార్య ఈశానితో విడాకులు తీసుకున్న క్రికెటర్ రాహుల్ చహర్
  • ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అధికారికంగా ప్రకటన
  • 15 నెలల పాటు కోర్టుల చుట్టూ తిరిగానని చహర్ వెల్లడి
  • చిన్న వయసులో పెళ్లి చేసుకోవడంపై పరోక్షంగా ప్రస్తావన
  • ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడనున్న రాహుల్
భారత యువ క్రికెటర్, లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ తన వైవాహిక జీవితానికి ముగింపు పలికాడు. తన భార్య ఈశాని జోహర్‌తో విడాకులు తీసుకున్నట్లు శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అధికారికంగా ప్రకటించాడు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు తెలిపాడు. 

రాహుల్ చహర్, ఫ్యాషన్ డిజైనర్ ఈశాని చాలాకాలం ప్రేమించుకున్నారు. 2019లో నిశ్చితార్థం చేసుకోగా, 2022 మార్చి 9న గోవాలో వీరి వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన నాలుగేళ్లకే వీరి బంధం ముగిసిపోవడం గమనార్హం. గత 15 నెలలుగా న్యాయపోరాటం చేసినట్లు రాహుల్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.

"నా జీవితంలోని ఒక అధ్యాయం అధికారికంగా ముగిసింది. దీనికోసం నేను చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నాను. అప్పుడు నా గురించి, నా విలువల గురించి పూర్తి అవగాహన లేదు. కొన్ని బంధాలు మనకు పాఠాలు నేర్పడానికే ఉంటాయి. ఇప్పుడు స్పష్టతతో, ఆత్మగౌరవంతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను" అని రాహుల్ తన పోస్ట్‌లో రాశారు.

ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో రాహుల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ. 5.20 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్‌కు సిద్ధమవుతున్నాడు. ఇటీవలి కాలంలో వ్యక్తిగత సమస్యలతో వార్తల్లో నిలిచిన యువ క్రికెటర్ల జాబితాలో ఇప్పుడు రాహుల్ కూడా చేరారు.


More Telugu News