Sridhar Babu: తెలంగాణలో అమెరికా టెక్ దిగ్గజాలతో కలిసి పీపీపీని ప్రోత్సహిస్తున్నాం: శ్రీధర్ బాబు

కృత్రిమ మేథ (ఏఐ) రంగంలో నూతన ఆవిష్కరణలకు తెలంగాణ కేంద్రంగా నిలుస్తోందని, అమెరికా పెట్టుబడిదారులకు ఇక్కడ అపార అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ప్రతిష్టాత్మక "ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్-2026"లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో అమెరికా-ఇండియా వాణిజ్య మండలి (USIBC) ప్రతినిధులతో జరిగిన రౌండ్ టేబుల్ సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేశారు.

ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణలో ఉన్న ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ టెక్నాలజీ ఎకోసిస్టం పెట్టుబడులకు నూతన అవకాశాలను సృష్టిస్తున్నాయని తెలిపారు. అమెరికాకు చెందిన టెక్ దిగ్గజాలతో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని తమ ప్రభుత్వం ఇప్పటికే ప్రోత్సహిస్తోందని చెప్పారు. ముందుచూపుతో కూడిన స్థిరమైన విధానాల వల్ల ఏఐ పరిశోధనలకు రాష్ట్రం గట్టి పునాది వేసిందని వివరించారు.

ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, పట్టణాభివృద్ధి వంటి కీలక రంగాలపై దృష్టి సారిస్తూ ఇన్నోవేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణను ఏఐ రంగంలో అగ్రగామిగా నిలబెట్టామని పేర్కొన్నారు. ప్రజా సేవలపై రియల్ టైం పర్యవేక్షణ కోసం కూడా కృత్రిమ మేథను వినియోగిస్తున్నామని వెల్లడించారు.

"కృత్రిమ మేథ ఆవిష్కరణలకు ప్రపంచంలోనే ఒక ముఖ్య కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే మా లక్ష్యం. వేగంగా దూసుకుపోతున్న టెక్నాలజీ ప్రపంచంతో పోటీ పడాలన్నదే మా సంకల్పం" అని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ దిశగా రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీ, ఏఐ హబ్ ల ఏర్పాటుతో పాటు, ప్రతిభావంతులైన మానవ వనరుల అభివృద్ధికి త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు.
Sridhar Babu
Telangana
PPP
Artificial Intelligence
AI Innovation
US India Trade
IT Investment Telangana

More Telugu News