Balka Suman: బాల్క సుమన్ ను 200 కి.మీ. దూరంలో ఉన్న జైలుకు తరలించడం అన్యాయం: హరీశ్ రావు

ఆదిలాబాద్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో మాజీ మంత్రి హరీశ్ రావు ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. క్యాతనపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మండిపడ్డారు.


"ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మహిళల పట్ల కాంగ్రెస్ నేతలు అసభ్యకరంగా ప్రవర్తించారు. మంత్రి వివేక్ సైతం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. కాంగ్రెస్ కౌన్సిలర్లు మద్యం మత్తులో బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్లను అగౌరవపరిచారు. అయినా పోలీసులు చోద్యం చూశారు. బాల్క సుమన్‌ను సమీప జైల్లో పెట్టకుండా 200 కి.మీ దూరంలో ఉన్న ఆదిలాబాద్ జైలుకు తరలించడం అన్యాయం" అని హరీశ్ మండిపడ్డారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుంటే రాహుల్ గాంధీకి పట్టదా? అని ప్రశ్నించారు. ప్రజల రక్షణ కోసం కవాతు నిర్వహించాల్సిన పోలీసులు బీఆర్ఎస్ నాయకులను భయభ్రాంతులకు గురిచేసేందుకు కవాతు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని... పోలీసులు అత్యుత్సాహం చూపిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 

మరోవైపు, ఈ ములాఖత్‌లో మాజీ మంత్రి జోగురామన్న, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, నాయకులు దివాకర్ రావ్, ప్రవీణ్ కుమార్, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Balka Suman
Harish Rao
BRS
Telangana Congress
Adilabad Jail
Kathanpalli
Illegal cases
BRS Leaders
Rahul Gandhi
Telangana Politics

More Telugu News