ఆ రెండు పార్టీలు తెలంగాణ వ్యతిరేక టీమ్: హరీశ్ రావు
- కాంగ్రెస్, బీజేపీలపై హరీశ్ రావు ఫైర్
- జెండాలు, అజెండాలు పక్కనపెట్టి దిగజారుడు రాజకీయాలు చేశారని విమర్శ
- కల్వకుంట్ల కుటుంబాన్ని రేవంత్ కాపాడుతున్నారని విమర్శ
కాంగ్రెస్, బీజేపీలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం జెండాలు, అజెండాలు పక్కనపెట్టి దిగజారుడు రాజకీయాలు చేశారని విమర్శించారు. బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ బీటీమ్ అంటూ కాంగ్రెస్... కాంగ్రెస్ కు బీఆర్ఎస్ బీటీమ్ అంటూ బీజేపీ.... గత 12 ఏళ్లుగా చేసిన ప్రచారమంతా తప్పుడు ప్రచారమేనని తేలిపోయిందని అన్నారు. ఆ రెండు పార్టీలు తెలంగాణ వ్యతిరేక టీమ్ అని తేలిపోయిందని చెప్పారు.
“మార్పు అంటే బీజేపీతో కలవడమా? ఇదేనా మీరు తెస్తానన్న మార్పు?” అని సీఎం రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ఢిల్లీలో కొట్టుకున్నట్టు నటిస్తూ... గల్లీలో చేతులు కలుపుకుని వాటాలు పంచుకుంటున్నారని ఆరోపించారు. సిర్పూర్ కాగజ్ నగర్, మెట్ పల్లి, అమన్ గల్, అలియాబాద్, నర్సాపూర్ ఫలితాలే దీనికి సాక్ష్యమని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఉన్న బలాన్ని చూసి భయపడే ఈ రెండు పార్టీలు సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి కుట్రలకు తెరలేపాయని, రాబోయే రోజుల్లో ప్రజలే వీళ్లకు బుద్ధి చెబుతారని హరీశ్ రావు గట్టిగా చెప్పుకొచ్చారు.