Ibrahimpatnam Municipal Election: ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక.. బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు షాక్!

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు షాకిచ్చింది. నిన్న వాయిదాపడిన 11 మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలలో రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం ఒకటి. 24 వార్డులకు గాను బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 8, బీజేపీ 2, స్వతంత్రులు ఒక స్థానం కైవసం చేసుకున్నారు. ఈరోజు జరిగిన మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పీఠాన్ని దక్కించుకుంది. ఛైర్మన్‌గా టేకు సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు.

అయితే, 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి అదృశ్యం కావడంతో ఈ ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది. తన తండ్రిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ యాదగిరి కుమారుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. యాదగిరిని ఎల్లుండి తమ ఎదుట హాజరుపరచాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. అప్పటి వరకు ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది. అయితే హైకోర్టు స్టే అందే సమయానికి సుదర్శన్ రెడ్డి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. దాంతో, హైకోర్టు ఆదేశాలతో వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.
Ibrahimpatnam Municipal Election
BRS Party
Telangana High Court
Take Sudarshan Reddy
Akula Yadagiri

More Telugu News