Krishna Patel: కొడుకు లేని లోకంలో ఉండలేం.. ఛత్తీస్‌గఢ్‌లో దంపతుల ఆత్మహత్య!

కుమారుడు మరణించాడన్న పుట్టెడు దుఃఖాన్ని తట్టుకోలేక ఓ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. తమ కుమారుడు లేని ఈ లోకంలో తాము ఉండలేమంటూ సూసైడ్ నోట్, వీడియో సందేశం రికార్డు చేసి ప్రాణాలు తీసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్-చంపా జిల్లాలో సోమవారం ఉదయం వెలుగుచూసిన ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

దర్దేయి గ్రామానికి చెందిన కృష్ణ పటేల్ (48), రమాబాయి పటేల్ (47) దంపతులకు ఆదిత్య పటేల్ (21) అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. 2024లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆదిత్య మరణించాడు. అప్పటి నుంచి ఆ దంపతులు తీవ్రమైన మానసిక వేదన అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లోని వేప చెట్టుకు ఒకే చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం ఉదయం గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నాలుగు పేజీల సూసైడ్ నోట్‌తో పాటు ఒక వీడియో సందేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. "మా జీవితానికి మా కుమారుడే పునాది. వాడు లేని జీవితం మాకు శూన్యం. పూర్తి స్పృహతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. దీనికి ఎవరూ బాధ్యులు కారు" అని లేఖలో పేర్కొన్నారు. తమ కుమారుడికి రావాల్సిన పరిహారం డబ్బులను కృష్ణ పటేల్ సోదరులకు ఇవ్వాలని వీడియోలో కోరారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. లేఖ, వీడియోలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించి దర్యాప్తు చేస్తున్నారు.
Krishna Patel
Chhattisgarh
couple suicide
son death
Janjgir Champa
road accident
suicide note
family tragedy
grief
India

More Telugu News