Iran oil tankers: ముంబై తీరంలో హైడ్రామా: మూడు ఇరాన్ చమురు నౌకలను సీజ్ చేసిన భారత్!

Mumbai Coast Guard Seizes Three Iran Oil Tankers
  • అమెరికా ఆంక్షల జాబితాలో ఉన్న ట్యాంకర్లను పట్టుకున్న కోస్ట్ గార్డ్
  • ఈ నౌకలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసిన ఇరాన్
  • భారత తీరంలో నిఘాను భారీగా పెంచిన అధికారులు
  • భారత్-అమెరికా మైత్రి బలపడుతున్న వేళ ఈ పరిణామం
అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘిస్తూ భారత జలాల్లో అక్రమంగా చమురు రవాణా చేస్తున్న మూడు భారీ ట్యాంకర్లను ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అమెరికా ఆంక్షల జాబితాలో ఉండి, ఇరాన్‌తో సంబంధాలున్న ఈ నౌకలను ముంబై తీరానికి సుమారు 100 నాటికల్ మైళ్ల దూరంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం వాటిని ముంబై నౌకాశ్రయానికి తరలించారు.

స్టెల్లార్ రూబీ, ఆస్ఫాల్ట్ స్టార్, అల్ జఫ్జియాగా గుర్తించిన ఈ నౌకలు, అధికారుల కళ్లుగప్పేందుకు తరచూ తమ గుర్తింపును మార్చుకుంటున్నట్లు తేలింది. అంతేకాకుండా, సముద్రం మధ్యలోనే ఒక నౌక నుంచి మరో నౌకకు చమురును బదిలీ (షిప్-టు-షిప్ ట్రాన్స్‌ఫర్) చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. ఆంక్షల నుంచి తప్పించుకోవడానికే విదేశాల్లో ఉన్న యజమానులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారని అధికారులు భావిస్తున్నారు.

భారత్-అమెరికా సంబంధాలు మెరుగుపడుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి అంగీకరించిన వెంటనే, అమెరికా భారత వస్తువులపై దిగుమతి సుంకాలను తగ్గించింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సంబంధిత నౌకలపై భారత్ కఠినంగా వ్యవహరిస్తోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

అయితే, ఈ మూడు ట్యాంకర్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్‌కు చెందిన 'నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ' (NIOC) స్పష్టం చేసింది. మరోవైపు, ఈ ఘటనతో అప్రమత్తమైన భారత కోస్ట్ గార్డ్.. తీరప్రాంత గస్తీని కట్టుదిట్టం చేసింది. ప్రస్తుతం 55 నౌకలు, 12 విమానాలతో నిరంతర నిఘా కొనసాగిస్తోంది.
Iran oil tankers
Indian Coast Guard
Mumbai
oil smuggling
US sanctions
maritime security
Stellar Ruby
Asphalt Star
Al Jabziya
National Iranian Oil Company

More Telugu News