ఆరోజు చిరంజీవి చేసిన సాయం చాలా గొప్పది: సాయికుమార్
- తన సినిమా 'పోలీస్ స్టోరీ'కి చిరంజీవి ప్రమోషన్ చేశారన్న సాయికుమార్
- పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ ఉన్నా తమకు సాయం చేశారని ప్రశంస
- చిన్న సినిమాను ప్రమోట్ చేయడం చిరంజీవి గొప్పదనమని కితాబు
తెలుగు సినీ పరిశ్రమలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ స్థాయికి ఎదిగారు చిరంజీవి. ఎంతో మందికి ఆయన ప్రస్థానం ఓ స్ఫూర్తిదాయకం. అంతేకాదు, యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటుడు సాయి కుమార్ మాట్లాడుతూ... చిరంజీవి గొప్పదనాన్ని ప్రశంసించారు.
అప్పట్లో పవన్ కల్యాణ్ మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ రిలీజ్కు సిద్ధంగా ఉండగా... సాయికుమార్ హీరోగా నటించిన చిత్రం ‘పోలీస్ స్టోరీ’ తెలుగులో డబ్ అయ్యి రిలీజ్ కావాల్సి ఉంది. సాయికుమార్ డబ్బింగ్ ఆర్టిస్ట్గానే గుర్తింపు పొందారు కాబట్టి, తెలుగులో హీరోగా మార్కెట్ లేదని భావించారు. దీంతో, మీరు ఈ సినిమాను ప్రమోట్ చేస్తే బాగుంటుందని చిరంజీవిని అడిగారు.
అయితే, తమ విన్నపాన్ని తొలుత చిరంజీవి సున్నితంగా తిరస్కరించారని సాయికుమార్ తెలిపారు. తాను బాగుందని చెబితే సినిమాకు ప్రేక్షకులు వస్తారని... కానీ, సినిమా బాగోకపోతే తనను తిట్టుకుంటారని చిరంజీవి అన్నారని చెప్పారు. కానీ, తాను పట్టుబట్టడంతో చిరంజీవి సినిమా చూశారని... ఆ తర్వాత తన నటనను అభినందించడమే కాకుండా... ప్రమోషన్ కోసం ఒక వీడియో కూడా చేశారని తెలిపారు.
ఆ వీడియో వల్ల ‘పోలీస్ స్టోరీ’కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయని సాయికుమార్ వెల్లడించారు. ఇప్పుడు ఆ జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంటూ సాయికుమార్ గర్వంగా చెబుతూ... “ఒక పక్క తమ్ముడి సినిమా రిలీజ్ ఉండగా... మరో పక్క చిన్న సినిమాను, యంగ్ యాక్టర్ను ఎంకరేజ్ చేయడం చిరు గారి గొప్పదనం” అని కితాబునిచ్చారు.