కార్పొరేట్ రంగంలోకి మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. మేఘా సంస్థలో కీలక పదవి

  • మేఘా అనుబంధ సంస్థ ఈవీ ట్రాన్స్‌లో చేరిన లక్ష్మీనారాయణ
  • వైస్ ప్రెసిడెంట్ - ఆపరేషన్స్‌గా నూతన బాధ్యతలు
  • సీబీఐ జేడీగా జగన్ కేసులను దర్యాప్తు చేసిన అధికారి
  • జనసేనలో చేరి, ఆపై సొంత పార్టీ స్థాపించిన లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ తన కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఆయన ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL)కు చెందిన అనుబంధ సంస్థ ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వైస్ ప్రెసిడెంట్ – ఆపరేషన్స్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ నియామకాన్ని సంస్థ లింక్డ్ఇన్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.

1990 మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన లక్ష్మీనారాయణ, సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో జగన్ అక్రమాస్తుల కేసుతో పాటు పలు కీలక కేసుల దర్యాప్తులో కీలకంగా వ్యవహరించి తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులయ్యారు. ముంబైలో అడిషనల్ డీజీగా పదవీ విరమణ చేసిన అనంతరం ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత 'జై భారత్ నేషనల్ పార్టీ' పేరుతో సొంత పార్టీని కూడా స్థాపించారు. కొంతకాలం పాటు వ్యవసాయం కూడా చేశారు.

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈవీ ట్రాన్స్, దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ బస్ ఆపరేటర్లలో ఒకటి. తెలంగాణ ఆర్టీసీతో పాటు ముంబై, పుణే వంటి నగరాల్లో దాదాపు 900కు పైగా ఎలక్ట్రిక్ బస్సులను ఈ సంస్థ నడుపుతోంది.

లక్ష్మీనారాయణకు ఐపీఎస్‌కు ముందే ఇంజినీరింగ్ నేపథ్యం ఉంది. ఎన్‌ఐటీ వరంగల్, ఐఐటీ మద్రాస్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆయనకున్న ఇంజినీరింగ్ పరిజ్ఞానం, పరిపాలన అనుభవం తమ సంస్థ అభివృద్ధికి దోహదపడతాయని ఈవీ ట్రాన్స్ యాజమాన్యం విశ్వాసం వ్యక్తం చేసింది. సుదీర్ఘ ప్రభుత్వ సేవ, రాజకీయ ప్రయోగాల తర్వాత ఆయన కార్పొరేట్ రంగంలోకి అడుగుపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.


More Telugu News