భారత్ బౌలర్ల ధాటికి పాక్ విలవిల.. 34 పరుగులకే 4 వికెట్లు డౌన్!

  • టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో భారత్ అమీతుమీ
  • తొలుత బ్యాటింగ్ చేసి 175 పరుగులు చేసిన టీమిండియా
  • మెరుపు అర్ధశతకంతో చెలరేగిన ఇషాన్ కిషన్ (77)
  • భారత బౌలర్ల దెబ్బకు ఒత్తిడిలో పాక్
కొలంబో వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. భారత్ నిర్దేశించిన 176 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. భారత పేసర్ల నిప్పులు చెరిగే బంతులకు సమాధానం చెప్పలేక కేవలం 34 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఛేదన ప్రారంభించిన పాకిస్థాన్‌కు హార్దిక్ పాండ్యా తొలి ఓవర్లోనే షాకిచ్చాడు. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్‌ను (0) డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత తన స్పెల్ ప్రారంభించిన జస్‌ప్రీత్ బుమ్రా.. ప్రమాదకర ఓపెనర్ సైమ్ అయూబ్ (6), కెప్టెన్ సల్మాన్ ఆఘా (4)లను స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేర్చి పాక్ పతనాన్ని శాసించాడు. ఆ తర్వాత బాబర్ అజామ్ (5)ను అక్షర్ పటేల్ బౌల్డ్ చేయడంతో పాక్ నాలుగో వికెట్ కోల్పోయింది. దీంతో పాకిస్థాన్ 4.5 ఓవర్లు ముగిసేసరికి టాపార్డర్‌ను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ ఆడుతున్నారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 77) మెరుపు అర్ధశతకంతో కదం తొక్కాడు. తిలక్ వర్మ (25), సూర్యకుమార్ యాదవ్ (32), చివర్లో శివమ్ దూబే (27) రాణించడంతో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం బాబర్ ఆజమ్, ఉస్మాన్ ఖాన్ క్రీజులో ఉండగా.. పాక్ విజయానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.




More Telugu News