Kalvakuntla Kavitha: తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు: జాతీయ మీడియాతో కల్వకుంట్ల కవిత

Kalvakuntla Kavitha Says Telangana People Blessed Us
  • మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తమకు సంతోషాన్ని ఇచ్చాయన్న కవిత
  • ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకున్నామన్న జాగృతి అధ్యక్షురాలు
  • తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని వ్యాఖ్య
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంతోషాన్ని వ్యక్తం చేశారు. కవిత మద్దతుదారులు పలు ప్రాంతాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆమె జాతీయ మీడియాతో మాట్లాడుతూ... భవిష్యత్తులో తాము ఒక రాజకీయ పార్టీగా అవతరించబోతున్నామనే విషయాన్ని ఇప్పటికే ప్రకటించామని తెలిపారు. తమ పార్టీని అధికారికంగా ప్రకటించక ముందే... మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేద్దామని చివరి నిమిషంలో తమ కార్యకర్తలు కోరారని... వారి కోరిక మేరకు తాము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై ఎన్నికల బరిలోకి దిగామని వెల్లడించారు. సొంత పార్టీ తరపున పోటీ చేయకపోయినప్పటికీ... తెలంగాణ ప్రజలు తమను మంచి ఫలితాలతో ఆదరించారని తెలిపారు.  

ఎన్నికల్లో తాము ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకున్నామని, మరో మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోబోతున్నామని కవిత చెప్పారు. మరో 40 చోట్ల తమ కార్యకర్తలు దాదాపుగా గెలుపు అంచుల వరకు వచ్చారని అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు తమ పార్టీ భవిష్యత్తుపై భరోసాను కల్పించాయని చెప్పారు. అహంకారం లేని, అత్యంత పారదర్శకమైన రాజకీయాలను అందిస్తామని తాము పదేపదే చెబుతున్నామని... ప్రజలు తమను విశ్వసించారని తెలిపారు. భవిష్యత్తులో కూడా తమకు ప్రజల మద్దతు ఇలాగే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో తాము ప్రధాన భూమికను పోషిస్తామని తెలిపారు.
Kalvakuntla Kavitha
Telangana
Municipal Elections
All India Forward Bloc
Telangana Politics
Jagruthi
Political Party
TRS
BRS

More Telugu News