పాక్‌తో పోరుకు ముందు గవాస్కర్ జోస్యం.. ఆ పేసర్‌పై వేటు?

  • పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ సింగ్‌ స్థానంలో కుల్దీప్ యాదవ్ రావొచ్చన్న లిటిల్ మాస్టర్
  • శ్రీలంక పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలించడమే దీనికి కారణమని విశ్లేషణ
  • సంజూ శాంసన్ బ్యాటింగ్ టెక్నిక్‌లో లోపం ఉందని వ్యాఖ్య
  • క్రీజ్‌లో ఎక్కువ సమయం గడపాలని సంజూకు సూచన
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరగనున్న హై-ప్రొఫైల్ మ్యాచ్‌లో భారత జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉందని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అంచనా వేశాడు. ఫామ్‌లో లేని పేసర్ అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డాడు.

గురువారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్ ప్రదర్శనను బట్టి ఈ విశ్లేషణ చేశాడు. ఆ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ తన పూర్తి నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేయలేదు. ఈ నేపథ్యంలో గవాస్కర్ మాట్లాడుతూ "హార్దిక్ పాండ్యా బౌలింగ్ ప్రారంభించడం చూస్తే పాక్‌తో మ్యాచ్‌లో అర్ష్‌దీప్ ఆడకపోవచ్చనిపిస్తోంది. కొలంబో పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలిస్తాయి. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం భారత్‌కు కొత్తేమీ కాదు. కాబట్టి పాక్‌తో మ్యాచ్‌లో కుల్దీప్ ఆడతాడని ఆశిస్తున్నా" అని స్టార్ స్పోర్ట్స్ కార్యక్రమంలో తెలిపాడు.

ఇదే సమయంలో బ్యాటర్ సంజూ శాంసన్ టెక్నిక్‌పైనా గవాస్కర్ స్పందించాడు. "సంజూ శాంసన్‌కు సాంకేతిక సమస్య ఉంది. అతడు క్రీజ్‌లో మరీ లోపలికి వెళ్లి ఫ్లిక్ షాట్ ఆడుతున్నాడు. కొత్త బంతితో ఆడేటప్పుడు అతడు తన టెక్నిక్‌ను మెరుగుపరుచుకోవాలి. పాక్‌తో మ్యాచ్‌లో అవకాశం వస్తే, క్రీజ్‌లో ఎక్కువ సమయం గడపడం ముఖ్యం" అని సలహా ఇచ్చాడు.

నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో అనారోగ్యంతో దూరమైన అభిషేక్ శర్మ స్థానంలో ఆడిన సంజూ శాంసన్, 8 బంతుల్లో 3 సిక్సర్లతో 22 పరుగులు చేసి మెరుపులు మెరిపించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో భారత్ 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.


More Telugu News