Narendra Modi: మోదీ రాజకీయ భవిష్యత్తుపై ట్రంప్ వీడియో.. స్పందించిన భారత్

"భారత ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ భవిష్యత్తు నాశనం చేయాలనుకోవడం లేదు" అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందించారు. ఆ వీడియోను తాను చూడలేదని అన్నారు. కానీ ఆ వీడియో ఉంటే కనుక అది నిజమో కాదో తెలుసుకుని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఆంక్షలు ఉన్న నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై గత ఏడాది భారత్ మీద ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో అధ్యక్షుడు ట్రంప్ శ్వేతసౌధంలో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీని గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసించారు. అదే సమయంలో మోదీ రాజకీయ జీవితంపై ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల భారత్, అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ట్రంప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంపై ఆయన స్పందించారు.

భారత్‌కు ఆహ్వానం అందింది

గాజా పునర్నిర్మాణం కోసం ట్రంప్ ఏర్పాటు చేసిన 'శాంతి మండలి'లో చేరాలని ఆహ్వానం వచ్చిందని రణధీర్ జైశ్వాల్ తెలిపారు. ఈ ప్రతిపాదనపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. అమెరికా నుంచి వచ్చిన ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ బోర్డుకు సంబంధించి ఫిబ్రవరి 19న జరిగే తొలి సమావేశానికి భారత్ హాజరవుతుందో లేదో ఆయన స్పష్టం చేయలేదు. అయితే పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలకు భారత్ ఎప్పుడూ మద్దతు ఇస్తుందని అన్నారు. గాజా సహా ఎక్కడైనా శాశ్వత శాంతికి మార్గం సుగమం చేసే అన్ని కార్యక్రమాలను ప్రధాని మోదీ స్వాగతించారని గుర్తు చేశారు.
Narendra Modi
Donald Trump
India
US Relations
Ranadhir Jaiswal
Gaza Reconstruction
Peace Council

More Telugu News