Municipal Elections Telangana: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్: ఖాతాలు తెరిచిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ

Telangana Municipal Elections Congress BRS BJP Open Accounts
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తున్నారు. తొలి ఫలితాలు వెలువడుతుండగా, ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు బోణీ కొట్టాయి.

ములుగు మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఆలోతు పద్మ 278 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం 15వ వార్డులోనూ కాంగ్రెస్ అభ్యర్థి సరిత గెలుపొందారు. మరోవైపు, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ విజయం సాధించి ఆ పార్టీ ఖాతా తెరిచారు. యాదగిరిగుట్ట ఒకటో వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఇప్పటికే పలు స్థానాలు ఏకగ్రీవం కాగా, వాటిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కొన్నింటిని కైవసం చేసుకున్నాయి.

ఇదిలా ఉండగా, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో స్ట్రాంగ్‌రూమ్‌ తాళం చెవి కనిపించకపోవడంతో అధికారులు తాళాన్ని పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై దాడులకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు. కౌంటింగ్ ప్రక్రియకు రాజకీయ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని ఆయన కోరారు. ప్రస్తుతం లెక్కింపు కొనసాగుతుండగా, పూర్తి ఫలితాలు వెలువడటానికి మరికొంత సమయం పట్టనుంది.
Go Back to Shorts
Municipal Elections Telangana
Telangana Municipal Elections
Congress
BRS
BJP
Telangana Local Body Elections
Telangana Politics
Mulugu Municipality
Ibrahimpatnam Municipality
Yadagirigutta

More Telugu News