బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య.. స్పందించిన మంత్రి శ్రీహరి

  • తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్న మంత్రి వాకిటి శ్రీహరి
  • తాను ఎప్పుడూ మహదేవప్పకు ఫోన్ చేయలేదన్న మంత్రి
  • మహదేవప్ప ఆత్మహత్యలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్య
మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యపై మంత్రి వాకిటి శ్రీహరి స్పందించారు. మహదేవప్ప ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలు రుజువైతే తాను దేనికైనా సిద్ధమని అన్నారు.

మహదేవప్పను బెదిరించినట్లుగా జరిగిన ప్రచారంపై మంత్రి స్పందించారు. బీజేపీ అభ్యర్థికి తాను ఎప్పుడూ ఫోన్ చేయలేదని స్పష్టం చేశారు. తన ఫోన్ కాల్ డేటాను పరిశీలించవచ్చని అన్నారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత వాస్తవాలు వెలుగు చూస్తాయని అన్నారు. మహదేవప్ప ఆత్మహత్య కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. ఎన్నికల భయంతోనే మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారని వివరించారు.

కాగా, మహదేవప్ప ఆత్మహత్యకు సంబంధించి ఆయన భార్య సత్యమ్మ పోలీసులకు ఇచ్చిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనకు ఎవరూ ఓటు వేయరనే భయంతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె పోలీసులకు లేఖ ఇచ్చారు. ఓడిపోతాననే భయంతో క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు.


More Telugu News