రైలు పట్టాలపై తల పెట్టి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

  • ఖైరతాబాద్‌లో విషాద ఘటన
  • మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో కొన్నాళ్ళుగా చికిత్స తీసుకుంటున్న మృతుడు
  • రైలు కింద తలపెట్టడంతో వేరుపడిన తల, మొండెం
హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్‌కు చెందిన తరుణ్ (30) ఖైరతాబాద్‌లో రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. 2017లో ప్రసన్నతో అతడికి వివాహం కాగా, మూడేళ్ల కుమార్తె ఉంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌లో అత్తవారింటికి సమీపంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు.

తరుణ్ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఏడాది నుంచి చికిత్స తీసుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తరుణ్ రైలు పట్టాలపైకి చేరుకున్నాడు. మధ్యాహ్నం ఖైరతాబాద్ రైల్వే గేటు సమీపంలో అతడు పట్టాలపై ఉండటంతో గేట్‌మెన్ బయటకు పంపించారు.

కొద్దిసేపటికి నాంపల్లి వైపు ఒక రైలు వెళుతుండటం చూసిన తరుణ్ పట్టాలపై తలపెట్టి పడుకున్నాడు. దీంతో అతని తల, మొండెం వేరయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతడి ఫోన్ రింగ్ అవుతుండటం చూసిన పోలీసులు, అవతలి వారికి విషయం తెలిపి వివరాలు కనుక్కున్నారు. నాంపల్లి జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News