Bandi Sanjay: సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ

Bandi Sanjay Writes Open Letter to Revanth Reddy
  • రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించకుండా వేదనకు గురి చేయడం సరికాదన్న బండి సంజయ్
  • ప్రభుత్వం కారణంగా 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు మృత్యు ఒడికి చేరుకున్నారని ఆవేదన
  • హైదరాబాద్ నడిబొడ్డున ఆందోళన, దీక్ష చేస్తామని హెచ్చరిక
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించకుండా మానసిక వేదనకు గురి చేయడం సరికాదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. పదవీ విరమణ చేసి రెండేళ్లయినా బెనిఫిట్స్ బకాయిలను చెల్లించకపోవడం దుర్మార్గమని అన్నారు.

రిటైర్డ్ అయ్యాక ప్రశాంతమైన జీవితాన్ని గడపాల్సిన రిటైర్డ్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం మానసిక వేదనకు గురి చేస్తుండటం క్షమించరాని నేరమని విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు మృత్యు ఒడికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

ఉద్యోగ విరమణ చేసిన వెంటనే బెనిఫిట్స్ అన్నీ చెల్లించి సగౌరవంగా సన్మానించి పంపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. తక్షణమే వారి బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. హైదరాబాద్ నడిబొడ్డున దీక్ష చేస్తామని అన్నారు.
Bandi Sanjay
Revanth Reddy
Telangana
Retired Employees
Pension Benefits
Government Negligence

More Telugu News