Tina Ambani: ఈడీ విచారణకు టీనా అంబానీ గైర్హాజరు

మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ గైర్హాజరయ్యారు. దాదాపు 40 వేల కోట్ల రూపాయల భారీ బ్యాంకింగ్ మరియు కార్పొరేట్ మోసానికి సంబంధించి ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో విచారించేందుకు టీనా అంబానీకి ఇటీవల నోటీసులు పంపింది. మంగళవారం టీనాను విచారణకు రమ్మని కోరగా.. ఆమె గైర్హాజరయ్యారు. దీంతో మరోమారు టీనా అంబానీకి నోటీసులు పంపించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

సుప్రీంకోర్టు కఠిన ఆదేశాలు
గత వారం అంబానీ గ్రూప్‌పై వస్తున్న కేసులను సమీక్షించిన సుప్రీంకోర్టు, ఈ దర్యాప్తుపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఎటువంటి పక్షపాతం లేకుండా "నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా మరియు వేగంగా" దర్యాప్తు జరపాలని ఈడీని ఆదేశించింది. ఈ అక్రమాల్లో ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కు లేదా ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలో విచారణ జరపాలని సీబీఐని కూడా సుప్రీం ఆదేశించింది.

రూ. 12,000 కోట్ల ఆస్తుల జప్తు
గత ఏడాది కాలంగా అనిల్ అంబానీ గ్రూప్‌పై ఈడీ తన పంజా విసురుతోంది. ఇప్పటివరకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(పీఎంఎల్ఏ) కింద మూడు కేసులు నమోదు చేయడమే కాకుండా, కంపెనీకి చెందిన దాదాపు రూ. 12,000 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. గతేడాది అనిల్ అంబానీని నేరుగా ప్రశ్నించిన ఈడీ అధికారులు, ఇటీవల కంపెనీ మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్ పునీత్ గార్గ్‌ను కూడా అరెస్ట్ చేశారు. అయితే, తమపై వస్తున్న ఆరోపణలను అనిల్ అంబానీ గ్రూప్ మొదటి నుంచీ కొట్టిపారేస్తోంది. తాము ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని ఆ సంస్థ వెల్లడించింది.
Tina Ambani
Anil Ambani
Enforcement Directorate
ED investigation
Money laundering case
Supreme Court
Banking fraud
Corporate fraud
PMLA Act
Assets seizure

More Telugu News