ఢిల్లీలో నిలిపి ఉంచిన కారులో మూడు మృతదేహాలు!

  • ఢిల్లీ పీరాగఢి ఫ్లైఓవర్‌పై కారులో మూడు మృతదేహాలు
  • మృతుల్లో ఒక మహిళ, ఇద్దరు పురుషులుగా గుర్తింపు
  • విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక అంచనా
  • మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవన్న అధికారులు
  • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం
రాజధాని ఢిల్లీలో పీరాగఢి ఫ్లైఓవర్‌పై పార్క్ చేసి ఉన్న కారులో ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు మృతిచెంది కనిపించారు. ఆదివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రాథమికంగా వీరు విషం సేవించి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతులను రన్‌హోలా ప్రాంతానికి చెందిన రణధీర్ సింగ్ (62), శివ్ నరేశ్ (42), జహంగీర్‌పురికి చెందిన లక్ష్మి సింగ్ (40)‌గా గుర్తించారు. వీరు ప్రయాణిస్తున్న కారు రణధీర్ సింగ్‌కు చెందినదిగా తేలింది. అందిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫ్లైఓవర్‌పై నిలిపి ఉన్న కారును గమనించారు. లోపల ముగ్గురూ మరణించినట్లు నిర్ధారించారు.

మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేదా ప్రతిఘటనకు సంబంధించిన ఆనవాళ్లు లేకపోవడంతో ఇది ఆత్మహత్యేనని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దోపిడీ లేదా దొంగతనం జరిగినట్లు కూడా ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరణానికి కచ్చితమైన కారణం తెలుస్తుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈ సంఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.


More Telugu News