Gummidi Sandhyarani: అందుకే అంబటి వ్యాఖ్యలపై ప్రజలు తిరగబడ్డారు: మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

Gummidi Sandhyarani Says People Reacted to Ambati Remarks
షార్ట్స్‌లో చూడండి
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే వైసీపీ నేతలు దిగజారుడు భాష, బూతులతో దాడి చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ నేతల విపరీత ధోరణిని ప్రజలు ఇక సహించబోరని, అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతే ఇందుకు నిదర్శనమని ఆమె అన్నారు.

డైవర్షన్ రాజకీయాలు పక్కనపెట్టి, దమ్ముంటే ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో కల్తీ లడ్డూపై చర్చకు 11 మందితో జగన్ రావాలని ఆమె సవాల్ విసిరారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే ఈ చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. హిందూమతంపై కోపంతోనే జగన్ తిరుమల లడ్డూలో రసాయనాలు వాడించి కల్తీ చేయించారని, ఆ పాపం బయటపడటంతో బూతుల భాషతో విషయాన్ని దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు.

గత ఏడాదిన్నరగా చంద్రబాబుపై వైసీపీ నేతలు చేస్తున్న అవమానాలు, దాడులను చూసి ప్రజలు కడుపుమంటతో రగిలిపోతున్నారని సంధ్యారాణి పేర్కొన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌తో చంద్రబాబు ఏ తప్పు చేయలేదని బట్టబయలైందని, 53 రోజులు అన్యాయంగా జైల్లో పెట్టారని స్పష్టమైందని అన్నారు. ‘క్లీన్ చిట్’ అంటే ఏంటో చంద్రబాబును చూసి వైసీపీ నేర్చుకోవాలని హితవు పలికారు.

ఆస్తి కోసం సొంత తల్లిని, చెల్లిని గెంటేసిన జగన్ ఆడబిడ్డల రక్షణ గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఆమె ఎద్దేవా చేశారు. వైసీపీకి ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని, అందుకే అంబటి రాంబాబు లాంటి వారిని బూతులు తిట్టడానికి వదిలారని విమర్శించారు. ఎన్ని డైవర్షన్ రాజకీయాలు చేసినా తిరుమల శ్రీవారికి చేసిన పాపాన్ని ప్రజలు మర్చిపోరని ఆమె వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Gummidi Sandhyarani
Ambati Rambabu
Tirumala laddu
Andhra Pradesh politics
YS Jagan Mohan Reddy
TDP
Chandrababu Naidu
Skill development case
YCP leaders
Diversion politics

More Telugu News