రహమాన్ అలా అనడం సరికాదు: నటుడు ముఖేష్ రిషి

  • రహమాన్ వ్యాఖ్యలపై స్పందించిన నటుడు ముఖేష్ రిషి
  • దేవుడు అన్నీ ఇచ్చాక ఫిర్యాదు చేయడం సరికాదన్న నటుడు
  • ఇండస్ట్రీలో నియమాలు అందరికీ ఒకేలా ఉంటాయని వ్యాఖ్య 
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ ఇటీవల చేసిన మతతత్వ వ్యాఖ్యలపై విలక్షణ నటుడు ముఖేష్ రిషి స్పందించారు. దేవుడు అంత గొప్ప స్థానాన్ని ఇచ్చిన తర్వాత కూడా పని గురించి ఫిర్యాదు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఐఏఎన్ఎస్ వార్తా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడిన ముఖేష్ రిషి "దేవుడు మీకు అన్నీ ఇచ్చినప్పుడు, నాకేమీ రావడం లేదని చెప్పడం భావ్యం కాదు. ఈ విషయాన్ని రహమాన్ ఆలోచించాలి" అని అన్నారు. ఇండస్ట్రీలోకి ఏటా ఎంతో మంది ప్రతిభావంతులు వస్తుంటారని, ఒక్కోసారి టాలెంట్ ఉన్నా పని దొరక్కపోవచ్చని ఆయన పేర్కొన్నారు.

"నాకు పని ఎందుకు దొరకడం లేదని నేను ఫిర్యాదు చేయలేను. ఇండస్ట్రీలో నియమాలు అందరికీ ఒకేలా ఉంటాయి. రాజకీయ నాయకుడైనా, సంగీత దర్శకుడైనా, నటుడైనా ఇదే వర్తిస్తుంది. రహమాన్ గత 20-25 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఆయన సంగీతాన్ని అందరూ ప్రేమించారు. ఎన్నో హిట్లు ఇచ్చారు. ఆయన కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి" అని ముఖేష్ రిషి వివరించారు.

కాగా, ఇటీవల బీబీసీ ఏషియన్ నెట్‌వర్క్‌తో మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో తనకు అవకాశాలు తగ్గడానికి 'మతతత్వం' కూడా ఒక కారణం కావచ్చని రహమాన్ వ్యాఖ్యానించారు. తనను బుక్ చేసుకున్నాక, మ్యూజిక్ కంపెనీలు తమకు నచ్చిన ఐదుగురు కంపోజర్లను పెట్టుకుంటున్నాయని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో, రహమాన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ వీడియోలో క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే.


More Telugu News