అన్నవరం ప్రసాదం కౌంటర్ లో ఎలుకలు... ఇద్దరిపై వేటు

  • మరోసారి వివాదంలో చిక్కుకున్న అన్నవరం ప్రసాదం
  • ప్రసాదం బుట్టల మధ్య పరుగులు తీస్తున్న ఎలుకలు
  • వీడియో బయటకు రావడంతో భక్తుల్లో ఆందోళన
  • విచారణ జరిపి ఇద్దరిపై వేటు వేసిన అధికారులు

అన్నవరం దేవస్థానం ప్రసాదం మరోసారి వివాదాల చుట్టూ తిరుగుతోంది. ఇటీవల ప్రసాదంలో నత్త ఉందంటూ ఓ జంట చేసిన హంగామా ఇంకా చల్లారకముందే, ఇప్పుడు ప్రసాదం కౌంటర్ వద్ద ఎలుకల హల్‌చల్ కొత్త దుమారాన్ని లేపింది.


ఇటీవల అన్నవరం హైవేపై ఏర్పాటు చేసిన ప్రసాదం కౌంటర్‌లో ప్రసాదం బుట్టల మధ్య ఎలుకలు పరుగులు తీస్తూ తిరుగుతున్న దృశ్యాలు కనిపించాయి. వాటిని వీడియోగా తీసిన ఓ భక్తుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం క్షణాల్లో వైరల్ అయ్యింది. ఇప్పటికే ప్రసాదం పరిశుభ్రతపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ వీడియో రావడంతో భక్తుల్లో ఆందోళన మరింత పెరిగింది.


ఈ ఘటనపై భక్తులు అక్కడే ఉన్న సిబ్బందిని ప్రశ్నించగా.. “కొనాలంటే కొనండి.. లేకపోతే వెళ్లిపోండి” అన్నట్టుగా నిర్లక్ష్యంగా స్పందించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం కాస్తా దేవస్థానం అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు సీరియస్‌గా స్పందించారు.


వెంటనే ఘటనపై అంతర్గత విచారణ చేపట్టిన అధికారులు, పర్యవేక్షణ లోపం ఉందని తేల్చారు. బాధ్యతారహితంగా వ్యవహరించారని నిర్ధారించడంతో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ దేవస్థానం ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు భక్తులకు హామీ ఇచ్చారు.



More Telugu News