నా ఇంటిని కూల్చేసిన వారికి తగిన శాస్తి జరిగింది: బీఎంసీ ఫలితాలపై కంగనా రనౌత్

  • బృహన్‌ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ-మహాయుతి కూటమి విజయం
  • దాదాపు 25 ఏళ్ల థాకరే కుటుంబ ఆధిపత్యానికి తెర
  • గతంలో తన ఇల్లు కూల్చివేతను గుర్తుచేస్తూ కంగన సంచలన వ్యాఖ్యలు
బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో థాకరే కుటుంబ సుదీర్ఘ ఆధిపత్యానికి తెరపడింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత శివసేన (యూబీటీ) అధికారాన్ని కోల్పోయింది. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. ఈ ఫలితాలపై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తన ఇంటిని కూల్చివేసిన వారికి తగిన శాస్తి జరిగిందని వ్యాఖ్యానించారు.

మొత్తం 227 వార్డులున్న బీఎంసీలో అధికారం చేపట్టేందుకు 114 సీట్లు అవసరం కాగా, బీజేపీ-ఏక్‌నాథ్ షిండే వర్గం శివసేన కూటమి 118 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఇందులో బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, షిండే వర్గం 29 సీట్లు గెలుచుకుంది. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) కేవలం 65 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ 24, ఎంఎన్ఎస్ 6 స్థానాల్లో విజయం సాధించాయి.

ఈ ఫలితాల తర్వాత కంగనా రనౌత్ స్పందిస్తూ తన పాత సంఘటనను గుర్తు చేసుకున్నారు. 2020లో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వ హయాంలో బీఎంసీ అధికారులు తన కార్యాలయంలోని కొంత భాగాన్ని కూల్చివేశారు. "నా ఇల్లు పడగొట్టారు, రేపు మీ అహంకారం బద్దలవుతుంది" అని అప్పట్లో ఆమె చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా పలువురు గుర్తుచేసుకుంటున్నారు. మహాయుతి కూటమి విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయంతో దేశంలోనే అత్యంత సంపన్నమైన కార్పొరేషన్ బీజేపీ కూటమి చేతికి వచ్చినట్లయింది. త్వరలోనే ముంబైకి కొత్త మేయర్‌ను ఈ కూటమి ఎన్నుకోనుంది.


More Telugu News