25 ఉత్తరాలతో పెళ్లి పిలుపు.. నిర్మలతో ప్రేమకథను వివరించిన పరకాల ప్రభాకర్!

  • జేఎన్‌యూలో పరిచయమైన పరకాల, నిర్మల
  • అప్పట్లో కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో పరకాల, ఫ్రీ థింకర్స్ గ్రూపులో నిర్మల
  • చేతిరాతతో 25 ఇన్లాండ్ లెటర్లు పంపి పెళ్లికి ఆహ్వానించిన ప్రభాకర్
  • తమది కులాంతర వివాహం కాదని, రెండు ప్రాంతాల మధ్య పెళ్లని వెల్లడి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్.. ఈ ఇద్దరూ భిన్న రాజకీయ నేపథ్యాలు, పూర్తి భిన్నమైన సిద్ధాంతాలు కలిగిన వ్యక్తులు. అలాంటి వీరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? పెళ్లి వరకు ఎలా దారితీసింది? ఈ ఆసక్తికర విషయాలను పరకాల ప్రభాకర్ స్వయంగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 

జేఎన్‌యూలో పరిచయం.. భిన్న ధ్రువాల కలయిక

ప్రభాకర్, నిర్మల సీతారామన్ ఇద్దరూ 1970-80ల కాలంలో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో చదువుకున్నారు. ప్రభాకర్ 1970లలో చేరగా, ఆయన కంటే రెండేళ్ల తర్వాత 1980లో నిర్మల జేఎన్‌యూలో అడుగుపెట్టారు. అప్పట్లో ప్రభాకర్ కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఎన్‌ఎస్‌యూఐ (NSUI)లో చురుకైన నాయకుడిగా ఉండేవారు. మరోవైపు, నిర్మల సీతారామన్ కమ్యూనిజం లేదా సోషలిజం వంటి మూస ధోరణులను కాదని, స్వతంత్ర భావాలను ప్రోత్సహించే "ఫ్రీ థింకర్స్" అనే గ్రూపులో సభ్యురాలిగా ఉండేవారు. సిద్ధాంతపరంగా పూర్తి భిన్నమైనా, జేఎన్‌యూలోని ప్రజాస్వామ్య స్ఫూర్తి తమ మధ్య స్నేహాన్ని పెంచిందని ప్రభాకర్ వివరించారు. పరస్పర విరుద్ధమైన రాజకీయ అభిప్రాయాలు ఉన్నప్పటికీ కలిసి ఉండగలగడమే జేఎన్‌యూ మేజిక్ అని ఆయన అభివర్ణించారు.

25 ఇన్లాండ్ లెటర్లతో పెళ్లి పిలుపు

తమ పెళ్లి చాలా నిరాడంబరంగా జరిగిందని ప్రభాకర్ గుర్తుచేసుకున్నారు. "సుమారు 25 ఇన్లాండ్ లెటర్లు కొని, నా చేతిరాతతోనే స్నేహితులకు, మామయ్యలకు, మా పెద్దన్నయ్యకు పెళ్లి పిలుపులు పంపాను. 'నేను, నిర్మల పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, ఫలానా చోట పెళ్లి జరుగుతోంది, తప్పకుండా రండి' అని మాత్రమే రాశాను" అని ఆయన తెలిపారు. అలా పిలిచిన 25 మందిలో దాదాపు 20 మంది పెళ్లికి హాజరయ్యారని చెప్పారు. ఇరువైపులా తల్లిదండ్రులకు తెలిపి, వారి అంగీకారంతోనే, వారి సమక్షంలోనే చెన్నైలో తమ వివాహం జరిగిందని స్పష్టం చేశారు.

మాది కులాంతర వివాహం కాదు..

తమది కులాంతర వివాహం అనే ప్రస్తావన వచ్చినప్పుడు, ప్రభాకర్ ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు. "మా నాన్న దశాబ్దాల క్రితమే కులాన్ని వదిలేశారు. ఆయన బ్రాహ్మణుడు, అమ్మ గౌడ సామాజిక వర్గానికి చెందినవారు. వారిది వేదికపై దండలు మార్చుకున్న 'దండల పెళ్లి'. నన్ను స్కూల్‌లో చేర్పించేటప్పుడు కూడా కులం, మతం కాలమ్‌లను ఖాళీగా వదిలేశారు. అందుకే మా పెళ్లిలో కులం అనే అంశం చర్చకే రాలేదు. మాది రెండు ప్రాంతాల మధ్య జరిగిన పెళ్లిగానే మేం భావించాం" అని ప్రభాకర్ వివరించారు.

పెళ్లి తర్వాత 1986లో ప్రభాకర్ పీహెచ్‌డీ కోసం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు వెళ్లగా, ఆరు నెలల తర్వాత నిర్మల కూడా అక్కడికి వెళ్లారు. 1991 లోక్‌సభ ఎన్నికలకు ముందు వారు తిరిగి భారతదేశానికి వచ్చారు. ఇలా భిన్న ధ్రువాల్లాంటి సిద్ధాంతాలు కలిగినప్పటికీ, జేఎన్‌యూ అందించిన మేధోపరమైన స్వేచ్ఛ, ప్రజాస్వామ్య వాతావరణం తమను ఒక్కటి చేసిందని ప్రభాకర్ తన గతాన్ని గుర్తుచేసుకున్నారు.


More Telugu News