కివీస్ తో తొలి వన్డే... గెలుపు దిశగా టీమిండియా

  • తొలి వన్డేలో భారత్ ముందు 301 పరుగుల భారీ లక్ష్యం
  • కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ (84) టాప్ స్కోరర్
  • ఛేదనలో రాణిస్తున్న టీమిండియా.. కోహ్లీ, గిల్ హాఫ్ సెంచరీలు
  • ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్
వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. కివీస్ నిర్దేశించిన 301 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ దూకుడుగా ఆడుతోంది. తాజా సమాచారం అందేసరికి, 31.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (71), శ్రేయస్ అయ్యర్ (24) క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 113 పరుగులు అవసరం కాగా, 8 వికెట్లు చేతిలో ఉన్నాయి.

లక్ష్య ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ (26) తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 118 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. కెప్టెన్‌గా బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడిన గిల్ (56) హాఫ్ సెంచరీ తర్వాత పెవిలియన్ చేరగా, కోహ్లీ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.

అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ (84) అద్భుత ఇన్నింగ్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలవగా, ఓపెనర్లు హెన్రీ నికోల్స్ (62), డెవాన్ కాన్వే (56) అర్ధశతకాలతో రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ తలా రెండు వికెట్లు పడగొట్టారు.


More Telugu News