నా భార్య న‌న్ను కొడుతోంది.. ఆమె నుంచి ప్రాణహాని ఉంది: పోలీసులకు ఫిర్యాదు చేసిన కన్నడ నటుడు

  • భార్య అర్షితపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కన్నడ నటుడు ధనుశ్‌ రాజ్
  • శారీరక దాడి, వేధింపులతో పాటు ప్రాణహాని ఉందని ఆరోపణ
  • రౌడీలతో కొట్టిస్తానని, చంపేస్తానని బెదిరిస్తోందన్న నటుడు
  • బెంగుళూరు గిరినగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడిగా, టీవీ సీరియళ్ల ద్వారా గుర్తింపు పొందిన ధనుశ్‌ రాజ్, తన భార్య అర్షితపై పోలీసులకు సంచలన ఫిర్యాదు చేశారు. తన భార్య తనపై శారీరకంగా దాడి చేసిందని, వేధింపులకు గురిచేస్తోందని, ప్రాణహాని బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ బెంగళూరులోని గిరినగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

ధనుశ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం అర్షిత తనకు సరిగా చెప్పకుండా విదేశాలకు వెళ్లింది. ఈ విషయంపై తాను ప్రశ్నించినందుకు ఆమె తనపై దాడి చేసిందని తెలిపారు. అంతేకాకుండా రౌడీలను పంపి కొట్టిస్తానని, అవసరమైతే చంపేస్తానని కూడా బెదిరించినట్లు ఆయన ఆరోపించారు.

అర్షిత బాత్రూమ్‌లోని గ్లాస్‌ ప్యానెల్‌కు చేయి కొట్టుకుని కావాలనే గాయపరచుకుందని, ఆ దాడికి తానే కారణమని చిత్రీకరించే ప్రయత్నం చేసిందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకుని తనను ఇరికిస్తానని కూడా ఆమె బెదిరించినట్లు ధనుశ్‌ ఆరోపించారు.

భార్య నుంచి వస్తున్న నిరంతర వేధింపులు, బెదిరింపుల నేప‌థ్యంలో తనకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించక తప్పలేదని ధనుశ్‌ తన ఫిర్యాదులో వివరించారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


More Telugu News