అసెంబ్లీలో కేసీఆర్ తో రేవంత్ రెడ్డి కరచాలనం.. వీడియో ఇదిగో!

  • కేసీఆర్ వద్దకు వెళ్లి పలకరించిన ముఖ్యమంత్రి
  • ఆరోగ్యం గురించి వాకబు చేసిన రేవంత్
  • రెండు నిమిషాలు సభలో ఉండి వెళ్లిపోయిన కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. విపక్ష నేత హోదాలో అసెంబ్లీకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సీఎం రేవంత్ రెడ్డి కరచాలనం చేశారు. సభలో కేసీఆర్ వద్దకు వెళ్లి పలకరించారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి సీఎం రేవంత్ రెడ్డి వాకబు చేశారు. మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌, సీతక్క, ఎమ్మెల్యే నవీన్‌యాదవ్‌ ఆయనను పలకరించి అభివాదం చేశారు.

రెండు నిమిషాల తర్వాత వెళ్లిపోయిన కేసీఆర్
అసెంబ్లీ సమావేశాల తొలిరోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ్యులు సంతాపం తెలిపారు. సంతాప తీర్మానాల అనంతరం కేసీఆర్‌ సభ నుంచి వెళ్లిపోయారు. మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజు సభలో ఉన్నది కేవలం రెండు నిమిషాలు మాత్రమే.


More Telugu News