Chandrababu: పీపీపీ విధానంలో కట్టినా.. అవి ప్రభుత్వ మెడికల్ కాలేజీలే: సీఎం చంద్రబాబు

Chandrababu Re scheduling Debts of Previous Government
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలో పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో నిర్మిస్తున్న వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని, వాటిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుధవారం అమరావతిలో జరిగిన 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు.

పీపీపీ విధానంలో కళాశాలలు నిర్మించినప్పటికీ, అవి ప్రభుత్వ వైద్య కళాశాలల పేరుతోనే పనిచేస్తాయని సీఎం హామీ ఇచ్చారు. "పీపీపీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి. వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేసేశారని కొందరు విమర్శిస్తున్నారు. కానీ నిబంధనలు పెట్టేది, నిర్దేశించేది ప్రభుత్వమే. ఈ కళాశాలల్లో 70 శాతం మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి, సీట్లు కూడా పెరుగుతాయి," అని చంద్రబాబు వివరించారు.

గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, "రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించి ప్రజాధనాన్ని వృధా చేశారు. ఆ డబ్బుతో రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మించి ఉండేవాళ్లం. ఇప్పుడు రుషికొండ ప్యాలెస్ ఓ వైట్ ఎలిఫెంట్‌గా మారింది," అని అన్నారు.

పీపీపీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరిస్తోందని గుర్తుచేశారు. "రోడ్లను పీపీపీ ద్వారానే నిర్మిస్తున్నారు. అంతమాత్రాన అవి ప్రైవేటు వ్యక్తులవి అయిపోతాయా?" అని ఆయన ప్రశ్నించారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా భయపడేది లేదని, వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని చంద్రబాబు తేల్చిచెప్పారు.
Go Back to Shorts
Chandrababu
Andhra Pradesh
AP CM
PPP projects
Medical Colleges
Debt rescheduling
Previous government
Financial crisis
NTR Vaidya Seva
Rushikonda Palace

More Telugu News